బీహార్ లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం-సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి మరోసారి పెరుగుతోంది. శీతాకాలం కావడంతో గతేడాది తరహాలోనే కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాదిలో ఢిల్లీ, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఓవైపు ఓమిక్రాన్ వైరస్ కేసులు, మరోవైపు సాధారణ కోవిడ్ కేసులతో పరిస్ధితి అల్లకల్లోలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీహార్ లో కోవిడ్ 19 ధర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో కోవిడ్ 19 ధర్డ్ వేవ్ మొదలైందని భావిస్తున్నట్లు నితీశ్ వెల్లడించారు. అయితే పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చినా బీహార్ లో అప్పుడే ఆ పరిస్ధితి రాలేదన్నారు. పరిస్ధితులు ఇంకా ముదిరితే అప్పుడు రాత్రి పూట కర్ఫ్యూపై ఆలోచిస్తామన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల్లో కరోనా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయినా బీహార్లో పరిస్ధితి మాత్రం అంత దారుణంగా ఏమీ లేదు. సాధారణ కోవిడ్ కేసులే నమోదవుతున్నాయి. అయినా కోవిడ్ 19 ధర్డ్ వేవ్ మొదలైందంటూ సీఎం నితీశ్ కుమార్ స్వయంగా ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. కేసులు నమోదవుతున్న అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోవిడ్ కేసుల వ్యాప్తికి కారణాల్ని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీ నుంచి రాకపోకలతోనే ఈ కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. సీఎం నితీశ్ రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్డ్ వేవ్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications