బీహార్ లో 15 రోజుల్లో కూలిన 10 బ్రిడ్జ్ లు- 11 మంది ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు..!
బీహార్ లో వరుసగా కూలుతున్న వంతెనలు దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి ఎక్కడ లేని చెడ్డపేరు తీసుకొచ్చాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో 10 బ్రిడ్జిలు జనం చూస్తుండగానే కుప్పకూలిపోవడంతో ఎన్డీయే సర్కార్ కు చెడ్డపేరు వచ్చింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న నితీశ్ సర్కార్.. ఇవాళ 11 మంది ఇంజనీర్లను ఈ ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపైనా శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.
తాజాగా బీహార్ లోని శరణ్ జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. ఇది జిల్లాలో 24 గంటల్లో కూలిన మూడో వంతెన కావడం విశేషం. దీంతో ప్రభుత్వం వరుస వంతెనలు కూలుతున్న వ్యవహారంపై విచారణ చేస్తోంది. ఇందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్గంజ్ జిల్లాల్లో తాజాగా 10 వంతెనలు కూలిపోయాయి.

ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో అన్ని పాత వంతెనలను సర్వే నిర్వహించి, తక్షణ మరమ్మతులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే కుప్పకూలిన వంతెనల వ్యవహారంపై విచారణ జరుగుతోందని ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. మరోవైపు వరుసగా వంతెనలు కుప్పకూలడానికి కారణం రాష్ట్రంలో వర్షాలే అంటూ మాజీ సీఎం, కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి.












Click it and Unblock the Notifications