మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఇద్దరు పౌరుల కాల్చి చంపారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం మరో ఇద్దరు పౌరుల ప్రాణాలు తీశారు. శ్రీనగర్లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్ని కాల్చి చంపారు. ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే ఈ దారుణాలు చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
కాగా, శ్రీనగర్లో మృతి చెందిన వ్యక్తిని బీహార్ రాష్ట్రానికి చెందిన అర్వింద్ కుమార్(37)గా పోలీసులు గుర్తించారు. అక్కడి ఈద్గా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. బాధితుడిని వెంటనే స్థానికులు శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల ఓ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని కూడా ఇదే ప్రాంతంలో కాల్చి చంపడం గమనార్హం. మరోవైపు పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్పెంటర్ సాగిర్ అహ్మద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఈ హత్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కాశ్మీర్లో కొద్ది రోజులుగా ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్న క్రమంలో పోలీసులు, కేంద్ర బలగాలు, సైనికులు లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భారీ ఎత్తును ఉగ్రవాదుల ఏరివేతను చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం వ్యవధిలోనే తొమ్మిది ఎన్ కౌంటర్లలో మొత్తం మ13 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు.
ఇద్దరు సైనికుల మృతదేహాలు లభ్యం
జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) , మరో సైనికుడి మృతదేహాలను సైన్యం గుర్తించింది. ఇద్దరు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటలపాటు భారీ గాలింపు తర్వాత వీరి మృతదేహాలను సైన్యం గుర్తించింది. వీరిద్దరితో కలిపి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులు వరుసగా దాడులకు తెగబడుతున్నారు.