సతీసహగమనం: భర్త చితిపైకి దూకి భార్య మృతి
పాట్నా: బీహార్లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది. 90 ఏళ్ల భర్త మరణాన్ని తట్టుకోలేని దాహ్వాదేవీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆయన చితిపైనే పడి ప్రాణాలర్పించింది. పరిమినియా గ్రామంలో నివసించే చరిత్రా యాదవ్, దాహ్వాదేవీ దంపతులు. చరిత్రా యాదవ్ చాలా కాలంగా కేన్సర్తో బాధపడుతూ
శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారులు, బంధువులు కలిసి ఆయన భౌతిక కాయానికి గ్రామ సమీపంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఆనవాయితీ ప్రకారం దాహ్వాదేవీ, ఆమె కోడలు అంత్యక్రియలు చేసే ప్రాంతానికి వెళ్లలేదు. కార్యక్రమాలు పూర్తైన అనంతరం వారంతా అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. అక్కడ తమ తల్లి కనిపించలేదు.
ఆమె కోసం వారు గాలిస్తుండగా శ్మశానవాటికకు వెళ్తుండగా చుశామని ఇరుగుపొరుగు చెప్పారు. వెంటనే వారు అక్కడి వెళ్లారు. అప్పటికే ఆమె భర్త చితిపైకి దూకి మరణించింది. దీంతో అక్కడే మిగతా కార్యక్రమాలు పూర్తి చేశారు. అయితే, మహిళ కుమారుడు రమేష్ మండల్ మాత్రం సంఘటనను ఖండిస్తున్నాడు.
తమ తడ్రి మరణించిన కొన్ని గంటల తర్వాత తమ తల్లి మరణించిందని, దాంతో ఇరువురి అంత్యక్రియలూ ఒకేసారి జరిపామని అంటున్నాడు. తమ తండ్రి మరణంతో తమ తల్లికి గుండెపోటు వచ్చిందని, దాంతో ఆమె మరణించిందని చెప్పాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య భర్త చితిపైకి దూకి మరణించిందని స్థానికులు అంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.