ఢిల్లీలో వైద్యురాలిపై ఇద్దరు బైకర్స్ యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఇద్దరు బైకర్లు దేశరాజధాని ఢిల్లీలో 30 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి యాసిడ్ వంటి రసాయనాన్ని మహిళపై చల్లారు. దీంతో మహిళ ముఖంపై, మెడపై కాలిన గాయాలయ్యాయి.
మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో డాక్టర్ అమృతా కౌర్ స్కూటీపై ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్తుండగా బైక్పై ఇద్దరు వక్తులు వచ్చి ఆమెపై యాసిడ్ చల్లారు. ఆ తర్వాత వాళ్లు ఆమె చేతి సంచీని లాక్కుని ప్రధాన మార్కెట్ గుండా పారిపోయారు. స్థానికులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు.
వైద్యురాలిపై విసిరింది పూర్తిగా యాసిడ్ కాదని, అటువంటి స్వభావం కలిగిన ద్రవమని పోలీసులు చెప్పారు. కౌర్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను ఎయిమ్స్కు తీసుకుని వెళ్లారు. ఆగంతకులు నల్లటిపై బైక్పై వచ్చి దాడికి పాల్పడ్డారు. నల్లటి కళ్లద్దాలు ధరించి ముఖాలకు ముసుగులు కప్పుకుని బైక్పై వచ్చారని చెబుతున్నారు.
మార్కెట్ ఏరియాలోని సిసిటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజౌరీ గార్డెన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలి కుడి కంటికి, కుడి ముఖానికి తగిన చికిత్స అవసరమని అంటున్నారు.