రిహన్నా ట్వీట్పై 'సోషల్' యుద్దం... ఆ లింకులు..? ఆంతర్యం వేరే ఉందంటోన్న రైట్ వింగ్..
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై అంతర్జాతీయ సమాజం స్పందిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాప్ స్టార్ రిహన్నా,పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్,మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితర అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లతో రైతుల ఆందోళన అంశం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఈ ట్వీట్లపై భారత్లో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడుస్తోంది. రైతు మద్దతుదారులు,వ్యతిరేకులు అన్న స్పష్టమైన చీలిక అక్కడ కనిపిస్తోంది. అంతేకాదు,రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన రిహన్నా లాంటి సెలబ్రిటీలపై రైట్ వింగ్ శక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రెండింగ్లో రిహన్నా ట్వీట్...
రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన వార్తను రిహన్నా తన ట్విట్టర్లో షేర్ చేశారు. 'ఎందుకని మనం దీని గురించి మాట్లాడుకోవట్లేదు...?' అని ఆ పోస్టుకు తన కామెంట్ను,#farmersprotest అనే హాష్ ట్యాగ్ను జత చేశారు. దీంతో పరోక్షంగా ఆమె రైతు ఉద్యమానికి మద్దతు పలికినట్లయింది. రిహన్నా ట్వీట్కు ట్విట్టర్లో 92వేల పైచిలుకు రియాక్షన్స్,2లక్షల పైచిలుకు రీట్వీట్లు,5లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. దాంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆంతర్యం వేరే ఉందంటోన్న రైట్ వింగ్..
రిహన్నా ట్వీట్పై సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు,రైట్ వింగ్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #Indiaagainstpropaganda అంటూ ఆమెపై మండిపడుతున్నారు. అంతేకాదు,రిహన్నా ట్వీట్ వెనుక అసలు ఆంతర్యం వేరే ఉందని ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు. ఖలీస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి మద్దతుదారుడైన కెనడా పార్లమెంటరీ నేత జగ్మీత్ సింగ్తో ఆమెకు సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. ట్విట్టర్లో ఆమె చేసిన పోస్టుకు భారీగానే డబ్బులు ముట్టాయని ఆరోపిస్తున్నారు. ఖలీస్తాన్ మద్దతుదారుడు అన్న కారణంతో 2013లో జగ్మీత్ సింగ్కు భారత్ వీసా కూడా నిరాకరించిందని గుర్తుచేస్తున్నారు. మొత్తంగా జగ్మీత్ సింగ్ డైరెక్షన్లోనే రిహన్నా ట్విట్టర్లో పెయిడ్ పోస్టులు చేసిందనేది వారి ఆరోపణ.
సోషల్ మీడియాలో యుద్దం...
అటు రిహన్నా ట్వీట్ను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో... ఆమెను సమర్థించేవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. రిహన్నాపై బీజేపీ నేతలు,రైట్ వింగ్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను వారు తిప్పి కొడుతున్నారు. డబ్బులు తీసుకుని ట్వీట్లు చేయడం బీజేపీ,రైట్ వింగ్ శ్రేణులకు అలవాటని... కాబట్టి అందరూ తమలాగే ఉంటారని వారు భావిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇలా రిహన్నాను వ్యతిరేకించే,సమర్థించేవాళ్ల ట్వీట్లతో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడుస్తోంది. సెలబ్రిటీలు వివేక్ రంజన్ అగ్నిహోత్రి,కంగనా రనౌత్ రిహన్నా జోక్యాన్ని తప్పు పట్టగా... పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ సహా తదితరులు ఆమె ట్వీట్ను సమర్థించారు.