పంజాబ్ ఓటమితో కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు
పంజాబ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను చంపాలని బీజేపీ భావిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు.
బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం బిజెపిపై విరుచుకుపడ్డారు. బిజెపి యువజన విభాగం బీజేవైఎం కార్యకర్తలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసం వద్ద సిసిటివి కెమెరాలు మరియు భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను దాడి చేసి ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ చంపాలని చూస్తోంది అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
పంజాబ్ ఎన్నికల్లో ఓటమితో కేజ్రీవాల్ ను చంపే కుట్ర చేస్తున్నారు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) ముందుగా కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసన తెలిపిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసనకారులు సిసి కెమెరాలు మరియు అడ్డంకులను ధ్వంసం చేశారని మండిపడ్డారు . పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించలేకపోయినందున, బిజెపి ఇప్పుడు ఆయనను చంపాలని చూస్తోంది అని పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఇంటిపై జరిగిన దాడి పోలీసుల సహాయంతో జరిగిందని ఆరోపించిన ఆయన ఈ దాడి బిజెపి కేజ్రీవాల్ను చంపాలనుకుంటున్నట్లు చూపిస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ గూండాలకు పోలీసుల సహకారం.. అందుకే కేజ్రీవాల్ ఇంటిపై దాడి
దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తాం అని సిసోడియా వెల్లడించారు. బీజేపీ గూండాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళనిచ్చారని, సీఎం నివాసం ఎదుట ఉన్న సీసీటీవీ కెమెరాలు, బారికేడ్లను, ఇంటి ముందు గేటును వారు ధ్వంసం చేశారని సిసోడియా విలేకరుల సమావేశంలో తెలిపారు. కేజ్రీవాల్పై జరిగిన ప్రాణహాని దాడి సరిగ్గా ప్రణాళికాబద్ధంగా జరిగింది అని ఆయన ఆరోపణలు గుప్పించారు.
నిరసన తెలియజేశాం .. ఎలాంటి దాడి చెయ్యలేదు: బీజేవైఎం నాయకులు
బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య నేతృత్వంలోని కార్యకర్తలు, కాశ్మీరీ పండిట్లను అవహేళన చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. కేజ్రీవాల్ నివాసం దగ్గర బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారని, అయితే విధ్వంసానికి పాల్పడలేదని బీజేవైఎం జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా పేర్కొన్నారు. తమను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్న ఆయన తేజస్వి సూర్యతో సహా మా సభ్యులు మరియు నాయకులలో దాదాపు 20-25 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని వెల్లడించారు. తర్వాత వారిని విడుదల చేశారు" అని బగ్గా పేర్కొన్నారు.
కాశ్మీర్ ఫైల్స్ రగడ .. బీజేపీ వర్సెస్ ఆప్; ఆందోళనలు, సంచలన ఆరోపణలు
ఇటీవల విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని పన్ను రహితంగా చేయాలనే వారి డిమాండ్పై గత వారం, కేజ్రీవాల్ బిజెపిపై విరుచుకుపడ్డారు. సినిమాను యూట్యూబ్లో పెట్టమని వివేక్ అగ్నిహోత్రిని అడగండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉచితంగా చూడవచ్చు. సినిమాపై పన్ను రహితం చేయాల్సిన అవసరం ఏముంది అని ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కేజ్రీవాల్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. అందులో భాగంగా చేపట్టిన నిరసనలో కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేశారని ఆప్ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ ను చంపేందుకు బిజెపి కుట్రలు చేస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది.