రివర్స్: మణిపూర్ బీజేపీదే, రాత్రికి రాత్రే హస్తం చేజారింది
హస్తం చేతికి వస్తుందనుకున్న మణిపూర్ చేజారేలా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.
ఇంపాల్: హస్తం చేతికి వస్తుందనుకున్న మణిపూర్ చేజారేలా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.
మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 31. కాంగ్రెస్ 28, బీజేపీ 21 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు చేయి అందిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.
హస్తం గుర్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉంది. కానీ అంతా తారుమారు అయింది. మణిపూర్లో గెలుపొందిన 'ఇతరుల్లో' బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి. వారు కమలం పార్టీకే మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఒక్కరోజులోనే.. అంతా తారుమారు అయింది.
మణిపూర్ బీజేపీదే!
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమయ్యింది. ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఆదివారం రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసి తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందని వివరించారు.
ఆ ఎమ్మెల్యేల మద్దతు
సోమవారం శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నట్లు బీజేపీ బృందానికి నేతృత్వం వహించిన బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టింది. వీరిలో ఒకరు కాంగ్రెస్, మరొకరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఉండటం గమనార్హం.
వేరుగా పోటీ చేసిన మిత్రపక్షాలు
నాలుగు స్థానాలు చొప్పున గెలుచుకున్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), ఒక స్థానంలో గెలుపొందిన ఎల్జేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నాయని బీజేపీ నేతలు వెల్లడించారు. అటు ఎన్డీఏలో, ఇటు ఈశాన్య ప్రజాతంత్ర కూటమిలో భాగస్వాములైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ ఈ ఎన్నికల్లో వేర్వేరుగానే పోటీ చేశాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ కూడా వేరుగానే పోటీ చేసింది.
రాం మాధవ్ ప్రకటన
ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి సహకరిస్తామని ఎన్పీపీ, ఎల్జేపీ ప్రకటించినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. నలుగురు సభ్యులున్న ఎన్పీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతిస్తామని కోహిమాలో ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్తో కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం పీఠాన్ని ఆశిస్తున్న బీజేపీ నేత ఎన్ బిరెన్ అంతకుముందు తెలిపారు.
ఎన్పీపీకి రెండు పదవులు!
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు గాను ఎన్పీపీకి రెండు పదవులు లభించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రితో పాటు కేంద్రంలో సహాయ మంత్రి పదవిని ఇచ్చేందుకు బీజేపీ జాతీయ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ తన కేబినెట్ను విస్తరించే సమయంలో ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మాను సహాయ మంత్రిగా చేర్చుకునే అవకాశముంది. మేఘాలయలోనూ ఎన్పీపీతో బీజేపీకి పొత్తు ఉంది. లోకసభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడైన కన్రాడ్ సంగ్మా తన తండ్రి మరణానంతరం 2016లో లోక్సభకు ఎన్నికయ్యారు. వచ్చే ఏడాదిలో మేఘాలయ అసెంబ్లీకి నిర్వహించే ఎన్నికల్లో బీజేపీ-ఎన్పీపీ ఉమ్మడిగా పోటీ చేస్తాయి.