'జయ' షాక్: రజనీకాంత్ వెంటపడట్లేదని బీజేపీ రివర్స్
చెన్నై: తమ పార్టీ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం అర్రులు చాచడం లేదని తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం బీజేపీ రజనీకాంత్ తదితరులకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీని పైన ఆమె స్పందించారు.
బీజేపీ రజనీకాంత్ పైన ఆధారపడటం లేదని ఆమె అన్నారు. నిర్మాణాత్మక విపక్షంగా వ్యవహరిస్తూ, తమ కీలక నేతల ద్వారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాతో తమ పార్టీ పుంజుకుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాము రజనీకాంత్ వెనుక పడటం ద్వారా బలోపేతం కావాలనుకోవడం లేదన్నారు.
రజనీకాంత్ వైపు బీజేపీ చూస్తోందన్న వార్తల పైన తమిళసాయి సౌందర రాజన్ సోమవారం ఢిల్లీలో స్పందించారు. రజనీకాంత్ వెనుక బీజేపీ పడుతోందనే ఊహాగానాలు పుట్టించారన్నారు. తమ పార్టీ విధానాలు నచ్చిన వారు బీజేపీలోకి రావొచ్చని, అది రజనీకాంత్ కూడా కావొచ్చన్నారు.

నరేంద్ర మోడీ బాగా పని చేస్తున్నారని, ఆయన పని తీరు పైనే తమ పార్టీ ఆధారపడిందన్నారు. 2016 సాధారణ ఎన్నికలలోను తమ అజెండా అదే అని చెప్పారు. తమ పార్టీకి సొంత భావజాలం ఉందని, అలాగే దేశం గురించి పని చేస్తోందన్నారు. కాగా, తమిళసాయి సౌందర రాజన్ సోమవారం ఢిల్లీలో పలువురు పార్టీ సీనియర్ నేతలను కలిశారు.
కాగా, రజనీకాంత్ వంటి వారి వైపు తమిళనాడులో బీజేపీ చూస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ సూపర్ స్టార్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. సౌందర రాజన్ కూడా ఇటీవల రజనీ భార్యను కలవడం చర్చకు దారితీసింది. రజనీ ఎప్పుడైనా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి.
అయితే, ఇటీవల అక్రమాస్తుల కేసులో అరెస్టు, జైలు నుండి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు రజనీకాంత్ లేఖ రాసి బీజేపీకి షాకిచ్చారు. దీంతో బీజేపీ యూ టర్న్ తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా జయకు లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications