మహా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తోంది: శరద్ పవార్ సంచలనం
ముంబై: దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అంతేగాక, మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఆరోపించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని ఆయన అన్నారు.

ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రంపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలంటించడంతోపాటు కీలక సూచనలు చేశారు. ప్రధాని మోడీ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి వందశాతం చూస్తున్నారని రాహుల్ ట్వీట్ చేయడంపై పవార్ స్పందించారు.
ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. ఆ వ్యక్తి విశ్వసనీయత తగ్గిపోతుంది. దీనిని రాహుల్ నివారించుకోవాలని శరద్ పవార్ సూచించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే గట్టి పునాది అని స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా నేను కాంగ్రెస్ పార్టీని చూస్తూనే ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటిపైకి తేవడంలో సోనియా గాంధీ విజయవంతం అయ్యారు. ఇప్పుడు ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా కేడర్ అంగీకరిస్తున్నారు. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ వెంటనే చేపట్టాలని పవార్ స్పష్టం చేశారు. దేశంలోని అందరు నేతలతో సంప్రదింపులు జరుపుతూ.. పార్టీ అంతటినీ ఏకతాటిపైకి తేవాలని సూచించారు. రాహుల్ గాంధీ మరోసారి దేశమంతా పర్యటించాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా రాహుల్ గాంధీ.. మోడీ ప్రభుత్వం వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్న నేపథ్యంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications