'ఆవు'ను మదర్ ఆఫ్ నేషన్గా గుర్తించాలన్న బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: ప్రతి భారతీయ మసీదులో గౌరి - గణేశుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్టు కొన్ని రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపైనర్, ఎంపీ యోగి ఆదిత్యానాథ్ మరోసారి వార్తల్లోకెక్కారు.
ఈసారి ఆయన ఆలోచనలు అవుపైకి మళ్లాయి. హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'ఆవు'ను రాష్ట్ర మాత లేదా మదర్ ఆఫ్ నేషన్గా గుర్తించాలని కోరారు. ఆవును సనాతన హిందూమత చిహ్నాంగా ఆయన పేర్కొన్నారు.
ఆవు వంశవృక్షం, వివిధ జంతువులు దేశంలోని మతపరమైన ప్రపంచానికి వారధిలా ఉంటాయని ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో గోవధను నిషేధించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆవు మాంసాన్ని విక్రయించినా.. ఎవరైనా కలిగి ఉన్నా కూడా వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తారు.
1995లో బీజేపీ - శివసేన ప్రభుత్వం తొలిసారిగా మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లును ఆమోదించింది. కానీ, అది ఇప్పుడే అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా ఆవుమాంసాన్ని విక్రయించినా, లేదా కలిగి ఉన్నా కూడా ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 10 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
హర్యానాలో కూడా గోవధపై నిషేధం విధించారు. గోవధ నిషేధ చట్టం తీసుకువచ్చే యోచనలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గోవధకు పాల్పడితే 302 సెక్షన్ కింద శిక్ష,మరణ శిక్షను అమలు పరచనున్నారు.