కర్ణాటకలో బీజేపీ నేతల సందడి: ఐదో సారి సమావేశాలు (పిక్చర్స్)
బెంగళూరు: బెంగళూరు నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా ఆ పార్టీ నాయకుల సందడి మొదలైయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు బెంగళూరు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలలోని బీజేపీ ముఖ్య మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు బెంగళూరు వచ్చారు.
బెంగళూరు నగరం మొత్తం బీజేపీ జెండాలు, కాషాయం రంగుల జెండాలతో రెపరెపలాడుతున్నది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్.కే. అద్వాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, యడ్యూరప్ప తదితర నాయకుల ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకుంటారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి లలిత్ అశోక్ హోటల్ వరకు రోడ్లకు ఇరు వైపుల నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడ చూసిన కర్ణాటక బీజేపీ నాయకులతో పాటు, నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రుల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర రాజధాని బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చెయ్యడంతో కాంగ్రెస్ నాయకులు ఉలిక్కి పడ్డారు.
కర్ణాటకలో ఐదవ సారి
కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశం ఐదవది. గతంలో 1982, 1993, 1999, 2008లో నాలుగు సార్లు కర్ణాటకలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి.
విభేదాలు పక్కన పెట్టి..
అన్ని రాష్ట్రాలలో ఉన్నట్లే కర్ణాటకలోని బీజేపీ నాయకుల మద్య గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ దగ్గర చులకన కారాదని భావించిన నాయకులు అందరూ కలిసి కట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర మంత్రులకు అగ్నిపరీక్ష
కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, సందానందగౌడ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నరేంద్ర మోడీ దగ్గర మంచి పేరు తెచ్చుకొవాలని వీరు భావిస్తున్నారు.
బహింరగ సభ..... నాయకుల బలప్రదర్శన
బెంగళూరులోని నేషన్ కాలేజ్ లో జరిగే బహిరంగ సమావేశంలో నాయకులు బలప్రదర్శన నిరూపించుకుని నరేంద్ర మోడీ దృష్టిలో పడాలని సిద్దం అవుతున్నారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ ఇదే ప్రాంతానికి చెందిన వారు.
ప్రధాని అయిన తరువాత మొదటి బహిరంగ సభ
నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత బెంగళూరులో జరుగుతున్న మొదటి బహిరంగ సమావేశం ఇది. నరేంద్ర మోడీ ఎన్నో సార్లు తనకు బెంగళూరు అంటే చాల ఇష్టమని చెప్పారు.
ఎన్ డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత
ఎన్ డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయాల మీద చర్చ జరుగుతుందని సమాచారం
ఏమి మాట్లాడుతారు
శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు నేషనల్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సమావేశంలో నరేంద్ర మోడీ ఏమి మాట్లాడుతారనే విషయంపై రాష్ర్ట ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మాజీలతో సమావేశం
ప్రధాని నరేంద్ర మోడితో మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ప్రత్యేకంగా సమాశం కావడానికి ఎర్పాటు చేశారు. బీజేపీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని నరేంద్ర మోడీ హామి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.