బెంగళూరులో అమిత్ షాకు ఘనస్వాగతం, 150 ఎమ్మెల్యే సీట్లు లక్షం, ఆట మొదలైయ్యింది!
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అమిత్ షాక్ కు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం)లో ఘనస్వాగతం పలికారు. శనివారం ఉదయం బెంగళూరు అతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాను కర్ణాటక బీజేపీ నాయకులు కలిశారు.
బెంగళూరు-బళ్లారీ జాతీయ రహదారిలోని టోల్ గేట్ దగ్గర బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప కర్ణాటక సాంప్రధాయం ప్రకారం మైసూరు పేట, శాలువతో అమిత్ షాను సన్మానించి బెంగళూరు నగరంలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
శనివారం మద్యాహ్నం బెంగళూరులోని బీజేపీ కార్యాలయం చేరుకున్న అమిత్ షా కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని ప్రారంభించారు. తరువాత కర్ణాటక బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో అమిత్ షా ముచ్చటించారు.
మూడు రోజుల పాటు అమిత్ షా కర్ణాటకలో పర్యటించనున్నారు. 25కు పైగా సభలు సమావేశాలు నిర్వహించడానికి అమిత్ షా సిద్దం అయ్యారు. త్వరలో కర్ణాటకలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో 150 సీట్లు కైవసం చేసుకోవడానికి అమిత్ షా సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీలో అభిప్రాయా విభేదాలు ఉన్న నాయకులను అమిత్ షా ఒక్కటి చెయ్యనున్నారు.