గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలకు మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఒకపక్క భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు విస్తరిస్తున్న సమయంలో, ప్రధానమైన ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్లో ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో జరగనున్న గోవా, ఉత్తరాఖండ్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపికి మిగిలిన అభ్యర్థుల పేర్లను నిర్ణయించడానికి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ (ఇసిఐ) పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు అధికారం ఇచ్చింది. ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ నిర్ణయం వెలువడింది.

అభ్యర్థుల జాబితా విషయంలో ఆచి తూచి సెలెక్ట్ చేస్తున్న బీజేపీ
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా బిజెపి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది బిజెపి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో పార్టీలో పని చేస్తున్న చాలా మంది సీనియర్ నాయకులకు టికెట్లు దక్కకపోవడంతో వారు పార్టీ ఫిరాయించినా, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని చెప్పినా బిజెపి అధినాయకత్వం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎన్నికల్లో విజయం సాధించడం దిశగానే ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘమైన కసరత్తు చేసి అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది.

ఈ నెలాఖరులోగా బీజేపీ అభ్యర్థులందరినీ ప్రకటించే ఛాన్స్
ఈ నెలాఖరులోగా బీజేపీ తన అభ్యర్థులందరినీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ మూలాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 165 మంది అభ్యర్థులను, పంజాబ్ అసెంబ్లీకి 65 మంది అభ్యర్థుల్లో 34 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఉత్తరాఖండ్కు 70 మంది అభ్యర్థుల్లో 59 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది , గోవా అసెంబ్లీకి 40 మందిలో 34 మందిని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికలోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టటంలో కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు బీజేపీ అధినాయకత్వం.

ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్ ఎన్నికలపై చర్చించడానికి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
ఉత్తరప్రదేశ్, మణిపూర్ మరియు పంజాబ్ ఎన్నికలపై చర్చించడానికి బిజెపి సిఇసి సమావేశం మంగళవారం నాడు జరుగుతుంది. యూపీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు పార్టీ సీఈసీ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశంలో ఉత్తరప్రదేశ్, మణిపూర్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ సమావేశం జరుగుతోంది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం
ఐదు రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, నాలుగో దశ ఫిబ్రవరి 23న, ఐదో దశ ఫిబ్రవరి 27న, ఆరో దశ మార్చి 3న మరియు ఏడో మరియు చివరి దశ మార్చి 7న నిర్వహించనున్నారు.మణిపూర్లో, పోలింగ్ రెండు దశల్లో జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 27 మరియు మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికలు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్ మరియు గోవాలకు ఫిబ్రవరి 14న మరియు పంజాబ్ కు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్లో పోలింగ్ తేదీని ఫిబ్రవరి 14గా మొదట ప్రకటించినా తర్వాత ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications