బెంగాల్లో గెలిస్తే ఫ్రీ కరోనా వ్యాక్సిన్- బీజేపీ ట్వీట్- ప్రత్యర్ధుల ఫైర్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరు దేశలు పూర్తయింది. ఈ వారంలో మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎన్నికల్లో మరో కొత్త హామీ ఇచ్చింది. బెంగాల్లో తాము గెలిస్తే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కాషాయ నేతలు తాజాగా ప్రకటించారు. దీంతో బీజేపీ ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
మే 1 నుంచి కరోనా వ్యాక్సిన్ల భారాన్ని రాష్ట్రాలపై మోపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం... సగం వ్యాక్సిన్లు మాత్రమే సరఫరా చేస్తామని ఇప్పటికే చెప్పేసింది. దీంతో మిగిలిన సగం వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, యూపీ, ఛత్తీస్ఘడ్తో పాటు అసోం ప్రభుత్వాలు తాము వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా వేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చేసిన తాజా ప్రకటన కలకలం రేపుతోంది.
బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రాగానే సాద్యమైనంత త్వరగా ప్రజలకు ఉచిత వ్యాక్సిన్లు వేయిస్తామంటూ బెంగాల్ బీజేపీ యూనిట్ ఓ ట్వీట్ చేసింది. సాధారణంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో చేయాల్సిన ఈ ప్రకటనను ట్వీట్ రూపంలో ఇంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్నికల పోలింగ్ ఆరు దశలు ముగిసిన తర్వాత బీజేపీ చేసిన ప్రకటనపై తృణమూల్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ వంటి విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి.
As soon as BJP government comes to power in West Bengal, COVID-19 vaccine will be provided free of cost to everyone. pic.twitter.com/gzxCOUMjpr
— BJP Bengal (@BJP4Bengal) April 23, 2021