333 .. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ : దక్షిణాదిలో పాగా కోసం ప్రణాళిక
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన బీజేపీ అప్పుడే 2024 ఎన్నికలపై ఫోకస్ చేసింది. తాము సాధించిన 303 సీట్లపై కాసింత అసంతృత్తితోనే ఉంది. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను 333కి చేరుకుంటుందని ధీమాతో ఉంది. 2014 282, 2019లో 303, 2024లో తమ సీట్ల సంఖ్య 333కి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తుంది.
ఉత్తరాదిలో సత్తా
ఉత్తరాదిలో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ సత్తాచాటింది. కానీ దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి ఆశించిన జనాధరణ లభించడం లేదు. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన సీట్లు సాధించలేదనే అసంతృప్తి ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఈ చోట్ల తమ పార్టీ మెరుగైన ప్రదర్శన సాధిస్తోందని విశ్వాసంతో ఉంది. దీంతో తమ మొత్తం సీట్ల సంఖ్య 333కి చేరుకుంటుందని లెక్కగట్టింది. హిందీ రాష్ట్రాల్లో సీట్లు సాధించిన మాదిరిగానే దక్షిణాదిలో కూడా విజయం తథ్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ, త్రిపుర ఇంచార్జీ సునీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు తాను తెలుగు నేర్చుకుంటున్నట్టు వివరించారు. బెంగాలీలో పీజీ చేసినట్టు మీడియాకు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలంటే .. ఊరికే ప్రచారం చేస్తే సరిపోదని, అక్కడి భాష నేర్చుకోవడం తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దక్షిణాదిలో నో ఎఫెక్ట్
ఇటీవల బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చిన .. అసలు తమ పార్టీ ప్రభావం చూపని ప్రాంతాలపై ఆ పార్టీ విశ్లేషిస్తోంది. దక్షిణాదిలో పార్టీ పరాజయానికి కారణమేంటీ అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తోంది. కర్ణాటకలో మెరుగైన .. తెలంగాణ, తమిళనాడులో ప్రభావం చూపలేదని అంశాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకలో 28 సీట్లలో 25 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో 17 సీట్లు ఉంటే 4 చోట్ల గెలుపొందింది. అయితే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖాతా తెరవకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బెంగాలే ఆదర్శం ..
ఈ ఫలితాలను బెంగాల్తో పోల్చుతున్నారు. 2014లో బెంగాల్లో బీజేపీ 2 సీట్లు గెలుచుకుంటే .. ఇప్పుడు 18 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. బెంగాల్ మాదిరిగానే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే ఈ సారి తమ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తామని .. భాగస్వామ్య పక్షాల కోసం కాదని సంకేతాలిచ్చారు. మరోవైపు తమది ' ప్రాంతీయ ఆకాంక్ష, జాతీయ వాదమని స్పష్టంచేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు. తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు.
కర్ణాటక వేరు ..
కర్ణాటకలో బీజేపీ మెజార్టీ సీట్లకు కారణం బలహీన ప్రతిక్షమని పేర్కొన్నారు. అక్కడున్న జేడీఎస్ కర్ణాటకలోకి అన్నీ ప్రాంతాలకు చేరుకోలేకపోయిందని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీల హవా ఉంటుందని .. కానీ కర్ణాటకలో పరిస్థితి మాత్రం విరుధ్దమని పేర్కొన్నారు. త్వరలో కేరళ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్యాచరణ ప్రారంభమవుతుందని సునీల్ తేల్చిచెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్ కేంద్రంగా తమ తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారాయన.