అధికార పగ్గాలు బీజేపీ-శివసేన కూటమికే: లేదంటే రాష్ట్రపతి పాలనే.. మేం ప్రతిపక్షంలోనే: శరద్ పవార్..!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెర పడేలా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశమేదీ తమకు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తేల్చి పడేశారు. మిత్రపక్షమైన కాంగ్రెస్ తో కలిసి తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వీలైనంత త్వరగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. లేకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలనను నివారించడానికి బీజేపీ-శివసేన కూటమి చొరవ తీసుకోవాలని అన్నారు.
మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్
ప్రజలు ఆశీర్వదించింది వారికే..
బుధవారం ఉదయం ఆయన తన నివాసంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, అందుకే ప్రజా తీర్పును గౌరవిస్తూ వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలను ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, దీనికి భిన్నంగా తాము ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పాతికేళ్లుగా కలిసే ఉన్నారుగా..
బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న పొత్తు ఈ నాటిది కాదని శరద్ పవార్ చెప్పారు. పాతికేళ్లుగా ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆ అవకాశమే లేదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అట్టే సమయం లేదని, ఈ నెల 7వ తేదీలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదని చెప్పారు. అలా కుదరకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలనను నివారించడానికి ప్రభుత్వ ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు.
రాజ్యసభ ఎన్నికలపై చర్చించాం..
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఈ ఉదయం తనను కలిశారని, తమ మధ్య ప్రభుత్వ ఏర్పాటు విషయం గానీ, పొత్తు సంబంధిత అంశాలేవీ గానీ ప్రస్తావనకు రాలేదని అన్నారు. త్వరలో రాజ్యసభ సీట్లు కొన్ని ఖాళీ కానున్నందున దీనిపై మాట్లాడామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల విషయంలో ఎన్సీపీ, శివసేన వేర్వేరుగా కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వాటని ఎలా పరిష్కరించుకోవాలనే విషయం మీద చర్చించామని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నట్టవుతుందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.