మూడు రోజుల ముఖ్యమంత్రి: ప్రజల్లోకి యడ్యూరప్ప: 28 ఎంపీ సీట్లు, రంగంలోకి శ్రీరాములు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప మూడురోజుల్లో శాసనసభలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలం అయ్యారు. శనివారం సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్. యడ్యూరప్ప బయట ప్రపంచానికి దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు. అధికారం లేదని ఇంటిలో చేతులుకట్టుకుని కుర్చోవడం ఇష్టంలేని బీఎస్. యడ్యూరప్ప ప్రజల మద్యకు వెళ్లాలని నిర్ణయించారు. అందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. యడ్యూరప్పతో పాటు బళ్లారి శ్రీరాములు రంగంలోకి దిగుతున్నారు.
ఉద్వేగ భరిత ప్రసంగం
ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ లోని కొందరు ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చి అధికారం నిలబెడుతారని బీజేపీ భావించింది. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడంతో శనివారం అసెంబ్లీలో ఉద్వేగ భరిత ప్రంసగం చేసిన బీఎస్. యడ్యూరప్ప రాజీనామా చేసి వెళ్లిపోయారు.
బీజేపీలో ఉత్కంఠ
సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్. యడ్యూరప్ప నిరాశతో ఉన్నారని, ఆయన ప్రస్తుత కర్తవ్యం ఏమిటని చర్చ మొదలైయ్యింది. అయితే ఆచర్చకు ఇప్పుడు సమాధానం చిక్కింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక విఫలం అయిన బీఎస్. యడ్యూరప్ప ఇంకా బలంపుంజుకున్నారు. ఆ ఉత్సాహంతో కర్ణాటక మొత్తం పర్యటించాలని యడ్యూరప్ప నిర్ణయించారు.
28 ఎంపీ సీట్లు లక్షం
జూన్ 1వ తేదీ నుంచి బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక మొత్తం పర్యటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాల్లో 2019 లో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. యడ్యూరప్ప పర్యటనకు కర్ణాటక మాజీ మంత్రి, మాస్ లీడర్ బళ్లారి శ్రీరాములు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
రెండు వైపుల నుంచి యాత్ర
బీఎస్. యడ్యూరప్ప, శ్రీరాములు పర్యటనలో కర్ణాటకలోని అన్ని లోక్ సభ స్థానాల్లో స్థానిక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతలుగా జరిగే రాష్ట్ర పర్యటనలో యడ్యూరప్ప ఒక వైపు నుంచి, బళ్లారి శ్రీరాములు మరో వైపు నుంచి పర్యటించనున్నారు.
అపవిత్ర స్నేహం
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అపవిత్ర కూటమితో అధికారంలోకి వస్తున్నారని, 104 సీట్లను బీజేపీకి కట్టబెట్టిన ప్రజల తీర్పును గౌరవించలేదని, అధికార దాహంతో అపవిత్ర స్నేహానికి పునాదివేశారని ఇదే సందర్బంలో బీజేపీ ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యింది. మొత్తం మీద నిరాశతో యడ్యూరప్పలేరని, రాష్ట్ర పర్యటన చేపడుతున్నారని వెలుగు చూడటంతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సహాం మొదలైయ్యింది.