యూపీలో మరోసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ ఆరు యాత్రలు: 2017 తరహాలోనే
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు యాత్రలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
లక్నోలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమై యాత్ర నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలను నిర్వహించాలని నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

బీజేపీని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరతామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు, బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో యూపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి 300లకుపైగా స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. భారత్ మాతా కీ జై అంటూ ట్వీట్ ముగించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. యాత్రకు సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ ఇదే విధంగా పరివర్తన్ యాత్రలు నిర్వహించింది. అప్పుడు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చి ప్రచారం నిర్వహించింది.
కాగా, ఉత్తరప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 ఉండగా, బీజేపీ గత ఎన్నికల్లో 312 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 13 స్థానాల్లో బీజేపీ భాగస్వామ్య పార్టీలు గెలుపొందాయి. కాగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం ఖాయమని ఓపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, సుమారు వంద సీట్లను కోల్పోయి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. ఈసారి వందకుపైగా సీట్లను దక్కించుకుంటుందని తెలిపాయి.












Click it and Unblock the Notifications