దొంగ అంటూ.. సుబ్రతాపై ఇంకు చల్లాడు, చితకబాదారు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కు మంగళవారం చేదు అనుభవం ఎదురయింది. విచారణ నిమిత్తం సుబ్రతాను పోలీసులు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతని ముఖంపై నల్లని సిరా చల్లాడు. సుబ్రతా ముఖంపై సిరా చల్లిన వ్యక్తి లాయర్.
సుబ్రతా దొంగ అని, జాతి సంపద దోచుకున్నాడంటూ దూసుకు వచ్చి అతనిపై ఇంకు చల్లాడు. మీడియా ప్రతినిధులను దాటుకొని వచ్చి ఈ పని చేశాడు. అతనిని సుబ్రతా రాయ్ అనుచరులు చితకబాదారు. కాగా, నల్లటి ఇంకు చల్లిన వ్యక్తి గ్వాలయర్కు చెందిన మనోజ్ శర్మగా గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైన సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుబ్రతా రాయ్ తరపు న్యాయవాది రాం జెఠ్మాలానీ తెలిపారు.
తన తల్లి అనారోగ్యంగా కారణంగానే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాలేకపోయారని సహారా గ్రూప్ అంతకుముందు పేర్కొంది. సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన 20 వేల కోట్ల రూపాయలకు సంబంధించి సెబికి సహారా గ్రూప్కు మధ్య నడుస్తున్న కేసులో కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ సుబ్రతా రాయ్ న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
అయితే ఫిబ్రవరి 24న కోర్టు ముందు హాజరయ్యేందుకు తాను ఢిల్లీకి వచ్చానని.. అయితే తన తల్లి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందడంతో తిరిగి లక్నోకు వెళ్లానని సుబ్రతారాయ్ పేర్కొన్నారు. అరెస్ట్కు ముందు ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడికి పారిపోలేదని, సుప్రీం ఆదేశాలను బే షరతుగా పాటిస్తానని పేర్కొన్నారు. అయన్ను అరెస్టు చేసేందుకు గురువారంనాడు కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు లక్నోలోని సుబ్రతా రాయ్ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన వారికి దొరకలేదు.
అయితే తాను మాత్రం లక్నోలోనే ఉన్నానని సుబ్రతా రాయ్ తెలిపారు. తాను తన తల్లి ఆరోగ్యం విషయంలో వైద్యుల బృందాన్ని కలిసేందుకు వెళ్లానని చెప్పారు. పోలీసులకు తమ విధులు నిర్వర్తించుకోవచ్చునని తాను ఇప్పటికే చెప్పానని సుబ్రతా రాయ్ పేర్కొన్నారు సుప్రీం కోర్టు అనుమతిస్తే మార్చి 3 వరకు అనారోగ్యంగా ఉన్న తన తల్లి వెంట ఉంటానని ఆయన వివరించారు. మార్చి 4న కోర్టు ఎదుట హాజరయ్యేందుకు తన పిటిషన్లో సంసిద్ధత తెలిపారు. బుధవారం కోర్టుకు గైర్హాజరుకావడంపై కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పారు.