'వీఐపీ' కల్చర్తో విలవిల్లాడుతున్నారు: ప్రత్యక్ష నరకంలో ఢిల్లీ జనం, ప్రాణాలే పోయేలా!
ఇదంతా సీసీటీవి కెమెరాలో రికార్డవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి ప్రాణం కంటే వీఐపీ మర్యాదలు ఎక్కువా? అంటూ ప్రయాణికులు అధికారులను విమర్శించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో వీఐపీ కల్చర్ పట్ల ఎప్పటినుంచో తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. దేశ రాజకీయ ప్రముఖులకు తోడు, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడల్లా.. రోడ్ల మీద సామాన్యులకు చుక్కలు కనిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే మరోసారి పునరావృతమైంది. ఓవైపు తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుంటే.. వీఐపీ ప్రోటోకాల్ అంబులెన్స్కు బ్రేక్ వేసింది.
దీంతో చిన్నారి తల్లిదండ్రులు పరిస్థితి ఎక్కడ విషమిస్తుందోనని తల్లడిల్లారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా సీసీటీవి కెమెరాలో రికార్డవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి ప్రాణం కంటే వీఐపీ మర్యాదలు ఎక్కువా? అంటూ ప్రయాణికులు అధికారులను విమర్శించారు.
కాగా, మలేషియా అధ్యక్షుడి రాక నేపథ్యంలో ట్రాఫిక్ ను నిలిపివేయాల్సి వచ్చిందని, ఇది ప్రోటోకాల్ నిబంధన ప్రకారం తప్పనిసరి పాటించాల్సిందేనని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎస్.రాంధవా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.