కాసేపట్లో వివాహం బంధంలోకి.. పెళ్లింట్లో నవ వధువును కాల్చి చంపిన ప్రేమించిన యువకుడు
లక్నో: మరికొద్ది సేపట్లో ఆనందంగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన నవ వధువు ప్రాణం తీశాడో దుర్మార్గుడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో పెళ్లి మండపంలోనే ఆమెను కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో చోటు చేసుకుంది.
మథురలోని మురిక్పూర్ గ్రామంలోని నౌజీల్ ప్రాంతంలో శుక్రవారం కుటుంబసభ్యులు, బంధువుల కోలాహలం మధ్యలో యువతి తన జీవితంలో కీలక ఘట్టమైన పెళ్లికి సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఆమె తన వివాహం జీవితంలోకి అడుగుపెడుతుందనగా.. ఆమెను ప్రేమించి, నిరాకరణకు గురైన ఓ యువకుడు పెళ్లి మండపంలోకి తుపాకీతో వచ్చాడు.
అందరూ చూస్తుండగానే ఆ నవవధువును కాల్చి చంపాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. ఊహించని పరిణామంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుందనుకున్న కూతురు.. విగత జీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చేపట్టామని మథుర రూరల్ ఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, అంతకుముందు కూడా బాధితురాలివివాహాన్ని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశాడు ఈ నిందితుడు.