మేయర్ సీటు: బీజేపీ, కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 101 సీట్లు ఉన్న బీజేపీ మేయర్ ఎన్నికలలో నామినేషన్ వేసింది. జేడీఎస్ తో జతకట్టిన కాంగ్రెస్ మేయర్ ఎన్నికలలో నామినేషన్ వేసింది.
స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు జై అనడంతో వారికి ఏనుగు అంత బలం వచ్చింది. శుక్రవారం ఉదయం బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి రామలింగారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మంజునాథ రెడ్డి బీబీఎంపీ మేయర్ ఎన్నికలలో నామినేషన్ వేశారు.
అదే విధంగా డిప్యూటి మేయర్ ఎన్నికలకు శాసన సభ్యడు గోపాలయ్య (జేడీఎస్) భార్య హేమలతా నామినేషన్ వేశారు. బీజేపీకి చెందిన సీనియర్ కార్పొరేటర్ మంజునాథ రాజు మేయర్ ఎన్నికలకు, డిప్యూటి మేయర్ ఎన్నికలకు నాగరత్న నామినేషన్లు వేశారు.

ఇంతకాలం రిసార్ట్ రాజకీయాలు చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ కార్పొరేటర్లు శుక్రవారం ఉదయం బెంగళూరు చేరుకుని నేరుగా బీబీఎంపీ కార్యాలయంలో అడుగు పెట్టారు. తమ సత్తా చూపిస్తాం అంటు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యడు సోమశేఖర్ బీబీఎంపీ కార్యాలయం ఆవరణంలో చాలెంజ్ చేశారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటి కావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బీబీఎంపీ ఎన్నికలలో ఓటు వెయ్యడానికి బెంగళూరు చేరుకున్నారు. అయన బీజేపీ నాయకులతో సంప్రదించి ఎలాగైనా మేయర్ ఎన్నికలలో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటకకు చెందిన ఐదుగురు మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, పలువురు ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్ సీలు కలిపి మొత్తం 260 మంది బీబీఎంపీ ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. ఈ సందర్బంగా వేలాధి మంది పోలీసులు బీబీఎంపీ కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలలో నిషేదాజ్ఞాలు విధించారు.












Click it and Unblock the Notifications