ఇలానే ఎందుకు?: రాజ్నాథ్ను నిలదీసిన యువతి
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బుధవారం ఊహించిన పరిణామం ఎదురైంది. ఢిల్లీ విమానాశ్రయానికి అతి సమీపంలో ద్వారక సెక్టార్ 8లో మంగళవారం ఉదయం బీఎస్ఎఫ్కు చెందిన సూపర్ కింగ్ విమానం కూలిపోయి ఇద్దరు ఫైలట్లతో పాటు ఎనిమిది మంది సాంకేతిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
బుధవారం వారి అంత్యక్రియల కార్యక్రమాన్ని ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. విమానం ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో రవీంద్ర కుమార్ అనే సబ్ ఇన్స్పెక్టర్ కూతురు సలోని నేరుగా హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను నిలదీసింది.

'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? చెప్పండి సర్ ఇలా ఎందుకు? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నిన్న కూలిపోయిన విమానం చాలా పాతది. అలా ఇవ్వడం సరికాదు. మీరు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం కావాలి' అంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
ఈ సమయంలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కంట కన్నీరు పెట్టుకున్నారు. ఇంతలో ఆమెను అక్కడున్న మహిళలు వెనక్కు లాగారు. అనంతరం కో పైలెట్ భార్య మీడియాతో మాట్లాడుతూ బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని తన భర్త చెప్పేవారని, ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నామని చెప్పారని అన్నారు.

అందుకే గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని చెప్పారు. ఈ విమానం పాతది అవడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తి అది కూలిపోయినట్లు తాను రాజ్నాథ్ సింగ్కు చెప్పినట్లు కోపైలెట్ రాజెష్ శివరాన్ మామ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జార్ఖాండ్లోని రాంచీ వెళ్తుండగా మంగళవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన రాజ్నాథ్ సింగ్ ఈరోజు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు.












Click it and Unblock the Notifications