నో ఎఫెక్ట్ : ఢిల్లీ-లాహోర్ల మధ్య యథాతథంగా నడుస్తున్న బస్సు సర్వీసులు
Recommended Video
ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సరిహద్దుల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దులో నివసిస్తున్న ప్రజలపై పలు ఆంక్షలు విధించడంతో వారికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో ఇరుదేశాల నుంచి చిరు వ్యాపారులు సరిహద్దులు దాటి తమ వ్యాపారాలు నిర్వహించుకుని తిరిగి తమదేశాలకు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల ఆంక్షలతో గత మూడురోజులుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సరిహద్దులో నివసించే చాలామంది ప్రజలది రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా చిరువ్యాపారులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ భారత్ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను పాక్ రైల్వే అధికారులు అటారీ స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రయాణికులంతా లాహోర్ స్టేషన్లో ఇరుక్కుపోయారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ - లాహోర్ల మధ్య నడిచే బస్సు సర్వీసులు మాత్రం యథాతథంగానే ఉన్నట్లు సమాచారం. బుధవారం కూడా 10 మంది ప్రయాణికులు బస్సులో బయలు దేరి లాహోర్కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఆ ప్రభావం బస్సు సర్వీసుపై పడింది. సాధారణ రోజుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకంటే తక్కువగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ కింద లాహోర్కు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఢిల్లీ గేట్ దగ్గర అంబేడ్కర్ స్టేడియం బస్సు టర్మినల్ నుంచి లాహోర్కు బస్సు బయలుదేరుతుంది. వారంలో మూడురోజులు ఈ సర్వీసులుంటాయి. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో సర్వీసులు ఉంటాయి. ఇక పాకిస్తాన్ నుంచి ఈ బస్సులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో ఢిల్లీకి బయలుదేరుతాయి.