నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?
పాట్నా: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు కొద్ది రోజుల్లోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీహార్ రాష్ట్రంలోని బక్సర్స్ జైలు.. ఉరితాళ్లను తయారుచేయమని ఈ జైలు అధికారులకు ఓ సందేశం వచ్చింది. కాగా, ఉరితాళ్లను తయారు చేయడంలో ఈ జైలు ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఉరితాళ్లను తయారు చేయాలంటూ..
డిసెంబర్ 14 నాటికి 10 ఉరితాళ్లను తయారుచేసి ఉంచాలని జైళ్ల డైరెక్టరేట్ నుంచి సూచనలు వచ్చినట్లు బక్సర్ జైలు సూపరిండెంట్ విజయ్ కుమార్ అరోరా వెల్లడించారు. అయితే వీటిని ఎక్కడికి పంపిస్తారనేది తమకు మాత్రం తెలియదని చెప్పారు.

అఫ్జల్గురుకి కూడా ఇక్కడ్నుంచే ఉరితాడు..
ఒక్క ఉరితాడును తయారు చేయాలంటే దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని అరోరా తెలిపారు. గత కొన్నేళ్లుగా బక్సర్ జైలులో ఉరితాళ్లను తయారు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ దాడుల దోషి అప్ఝల్ గురును ఉరితీసేందుకు కూడా తాడు ఇక్కడి నుంచే పంపించాయని తెలిపారు.

అతి త్వరలో ఉరితీస్తారంటూ..
2012లో దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి కోర్టు ఇప్పటికే ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ దోషులుకు డిసెంబర్ నెలాఖరులోగానే ఉరితీయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బక్సర్ జైలుకు ఉరితాళ్లను తయారుచేయాలంటూ సందేశాలు రావడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయింది.

క్షమాభిక్ష కోరితే తిరస్కరణే..
కాగా, నిర్భయ హత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, వారిలో రామ్ సింగ్ అనే నిందితుడు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతనికి విధించిన శిక్షను అనుభవించాడు. వినయ్ శర్మతోపాటు మరో ముగ్గురు నిందితులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్లకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు నిర్భయ దోషులకు క్షమాభిక్ష పెట్టేందుకు నిరాకరించాయి. వినయ్ శర్మ పేరుతో దాఖలైన క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఇలాంటి దారుణమైన కేసుల్లో క్షమాభిక్ష పెట్టడం కుదరదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications