caa affect: మేఘాలయాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి, ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీని రక్తసిక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీ పరిధిలో ఐబీ, కానిస్టేబుల్ సహా 42 మంది చనిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వైపు ఢిల్లీలో నిరసన జ్వాల ఎగిసిపడుతోన్న క్రమంలో ఇటు మేఘాలయాలో కూడా ఆందోళనలు మిన్నంటాయి. తూర్పు ఖాసీ జిల్లాలో ఖాసీ విద్యార్థి విభాగం, గిరిజనేతరుల మధ్య ఘర్షణ జరిగింది.
CAA నిరసన ప్రదర్శనలో దారుణం: విద్యార్థులపై కాల్పులు: స్వాతంత్య్రం కావాలా అంటూ బీభత్సం!
ఇరువర్గాల ఘర్షణ..
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చర్చ జరిగింది. దీంతో ఖాసీ స్టూడెంట్ యూనియన్, గిరిజనేతరుల మధ్య మాటా మాటా పెరిగింది. దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మొబైల్ ఇంటర్నేట్ సేవల నిలిపివేత..
ఇక్కడ పరిస్థితి చేయిదాటకూడదనే ఉద్దేశంతో సున్నితమైన ఆరు జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తూర్పు జైంతియా హిల్స్, పశ్చిమ జైంతియా హిల్స్, తూర్పు ఖాసీ హిల్స్, రి బోయి, పశ్చిమ ఖాసీ హిల్స్, సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు షిల్లాంగ్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు అధికారులు కర్ఫ్యూ విధించారు.
బీభత్సం..
కేఎస్యూకు చెందిన సభ్యులు ఘర్షణ తర్వాత రెచ్చిపోయారని స్థానికులు చెప్తున్నారు. మార్కెట్ సమీపంలో గడ్డివామును తగులబెట్టారు. ఇంటిని తగులబెట్టేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తర్వాత మిగతా వర్గం రెచ్చిపోయి.. కేఎస్యూ సభ్యులకు చెందిన వాహనాలను ధ్వంసం చేసిందని స్థానికులు చెప్తున్నారు. ఘర్షణలో చనిపోయిన కేఎస్యూ సభ్యుడు లుర్షాయ్ హిన్నివేటాగా గుర్తించారు. ఘర్షణలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని మేఘాలయా సీఎం కంగ్రాడ్ సంగ్మా పేర్కొన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ రంగంలోకి దించామని పేర్కొన్నారు.