చారిత్రక అన్యాయాలను సరిచేయడానికే: పాక్లో ముస్లిమేతరులపై వివక్ష? నరేంద్ర మోడీ.. !
Recommended Video
న్యూఢిల్లీ: చారిత్రక అన్యాయాన్ని సరి చేయాలనే ఉద్దేశంతోనే తాము పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా భావించే భారత్లో మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి కారణమైన వారిని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారత్లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడానికి వ్యతిరేకిస్తోన్న ఆందోళనకారులు.. పాకిస్తాన్లో నివసించే మైనారిటీలకు న్యాయాన్ని అందించగలరా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకుని..
మంగళవారం దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లోకాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని మోడీ పరోక్షంగా ఆరోపించారు.
ముస్లిమేతరులకు పాకిస్తాన్లో టాయ్లెట్లను కడిగే పని అప్పగించే ప్రయత్నం..
పాకిస్తాన్లో నివసిస్తోన్న ముస్లిమేతరులకు టాయ్లెట్లను కడిగే ఉద్యోగాలను కల్పించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగించిందని మోడీ అన్నారు. పారిశుద్ధ్య విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముస్లిమేతరులు దరఖాస్తు చేసుకోవాలంటూ కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేసిందని చెప్పారు. పాకిస్తాన్లో నివసించే ముస్లిమేతరులు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారనడానికి దీన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చని అన్నారు.
పొరుగు దేశాల్లో దశాబ్దాల కాలంగా..
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లల్లో దశాబ్దాల కాలంగా ముస్లిమేతరులు, మైనారిటీలు తీవ్ర అన్యాయానికి, వివక్షతకు గురవుతున్నారని అన్నారు. వాటిని సరి చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులకు పౌరసత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఆ చట్టాన్నివ్యతిరేకించడం కాంగ్రెస్కు సమంజసం కాదని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో కొన్ని రాజకీయ కుటుంబాల వల్లే..
జమ్మూ కాశ్మీర్లో కొన్ని రాజకీయ కుటుంబాల వల్లే అక్కడ హింస అనేది సజీవంగా ఉంటూ వచ్చిందని, స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ ఇదే తరహా వాతావరణం అక్కడ నెలకొని ఉందని నరేంద్ర మోడీ అన్నారు. దీని ఫలితంగానే అక్కడ ఉగ్రవాద ప్రభావం తీవ్రంగా ఉంటూ వచ్చినందని అన్నారు. దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.
యుద్ధాల్లో ఓడిపోయినప్పటికీ..
ఇప్పటిదాకా భారత్తో జరిగిన మూడు యుద్ధాల్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిందని నరేంద్ర మోడీ అన్నారు. అయినప్పటికీ.. పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోలేదని మండిపడ్డారు. పరోక్షంగా యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ తోక ఝాడించిన ప్రతీసారి.. మనదేశ సైన్యాధికారులు తిప్పి కొట్టడానికి ప్రయత్నించారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వారిని నిలువరించారని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.