కేరళ సహా ఏ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: సీఏఏపై తేల్చేసిన కేంద్రమంత్రి రవిశంకర్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ బద్ధమైనదని, పార్లమెంటు ఉభయసభల ఆమోదంతోనే చట్టంగా మారిందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

పార్లమెంటుకు మాత్రమే..
పౌరసత్వం విషయాల్లో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఏ చట్టాలనైనా చేసే అధికారం ఉంటుంది. పార్లమెంటు చేసిన చట్టాన్ని కేరళతో రాష్ట్ర అసెంబ్లీతోపాటు దేశంలోని ఏ అసెంబ్లీకి కూడా అడ్డుకునే అధికారం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయాల్సిన, పాటించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని రాజ్యాంగం చెబుతోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విధంగా స్పందించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం చట్టంపై తప్పుడు ప్రచారం..
పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ పౌరుడికీ సంబంధం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలపై కేంద్రమంత్రి మండిపడ్డారు. జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) అంశంపై ఆయన స్పందిస్తూ.. ఎన్పీఆర్ అనేది సాధారణ నివాసితులకు సంబంధించిన సంక్షిప్త రూపమని అన్నారు. ఇందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసం లేదని చెప్పారు.

సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం..
ఇది ఇలావుంటే, కేరళ సీఎం పినరయి విజయన్ మాత్రం రాష్ట్రాలకు కూడా కొన్ని అధికారాలుంటాయిన వ్యాఖ్యానించారు. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ.. ఆ చట్టాన్ని అమలు చేయబోమంటూ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయం తెలిసిందే. సీఏఏను ఉపసంహరించుకోవాలంటూ ఆయన కేంద్రానికి సూచించారు. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు.

పౌరసత్వ చట్టం ఆ మూడు దేశాల శరణార్థులకు మాత్రమే..
పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టంగా అమల్లోకి వచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వివక్షను, హింసను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశంలోకి శరణార్థులగా వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. 2014కు ముందు ఈ మూడు దేశాల నుంచి భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధుల, తదితర మైనార్టీ వర్గాలకు ఈ చట్టం ద్వారా మనదేశం పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications