రైతులకు గుడ్ న్యూస్: రబీకి 6 పంటల మద్దతు ధర పెంపు, వరి మాత్రం లేదు
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. రబీ సాగు చేసే కొన్ని పంటలకు మద్దతు ధర పెంచింది. ఆరు పంటలకు మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీపావళికి ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయించింది. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఎర్ర కందిపప్పు- క్వింటాలుకు రూ.500 పెంచింది. ఆవాలు- క్వింటాలుకు రూ.400 పెంచింది. కుసుమ - క్వింటాలుకు రూ.209 పెంచింది. గోధుమలు- క్వింటాలుకు రూ.110 పెంచింది. బార్లీ- క్వింటాలుకు రూ.100 పెంచింది. శనగలు - క్వింటాలుకు రూ.105 పెంచింది.
అయితే ప్రధాన పంట వరి ఊసు ఎత్తలేదు. ఇప్పటికీ యాసంగిలో కూడా వరి పంటను పండిస్తున్నారు. సో.. దానిపై ప్రతిష్టంభన నెలకొంది. ఖరీఫ్ కాక.. రబీలోనే.. అదీ కూడా కొన్ని ఎంపిక చేసిన పంటలకు మాత్రమే మద్దతు ధరను పెంచింది. ఇదీ ముమ్మాటికీ కంటి తుడుపు చర్య అని కాంగ్రెస్ పార్టీ అంటోంది.