కోర్టులో కంటతడి పెట్టిన జయేంద్ర సరస్వతి
చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి సోమవారం కోర్టులో విచారణ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వ్యాపారవేత్త రాధాకృష్ణన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు జయేంద్ర సరస్వతిని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి క్లుప్తంగా సమాధానాలిచ్చిన ఆయన ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అసత్యమని ఆయన చెప్పారు.
సెప్టెంబర్ 20, 2002లో చెన్నైలోని వ్యాపారవేత్త రాధాకృష్ణన్, ఆయన సతీమణిపై దాడి జరిగింది. ఆయన కంచిమఠంలో జరుగుతున్న అక్రమాలపై సోమశేఖర్ గణపతిగళ్ అనే మారుపేరుతో కరపత్రాలు ముంద్రించేవారని, దాంతో ఆయనపై కావాలనే దాడి చేశారనే ఆరోపణలతో చెన్నై పట్టిణంపాకం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు కంచిమంఠంలో శంకర్రామన్ అనే ఉద్యోగి హత్యకు గురికావడంతో ఆ కేసులో జయేంద్రను పోలీసులు 11 నవంబరు 2004లో అరెస్టు చేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే ఈ దాడి కేసుకు సంబంధించి కూడా జయేంద్రను లాంఛనంగా అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత న్యాయస్థానం శంకర్రామన్ కేసులో జయేంద్రను నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ దాడి కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులో జయేంద్ర సరస్వతి, కంచిమఠం చిన్నస్వామి విజయేంద్ర సరస్వతి సోదరుడు రఘు సహా మొత్తం 13 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో అప్పు అనారోగ్యంతో మరణించగా, కదిరవన్ అనే నిందితుడు హత్యకు గురయ్యాడు. కేసులో నిందితులపై నిందారోపణలు రూపొందించడానికి (ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్) జయేంద్రను న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించడంతో ఆయన కోర్టుకు వచ్చారు.
మొత్తం 55 మంది సాక్షుల నుంచి సేకరించిన వివరాలు, 220 పత్రాల ఆధారంగా ప్రాసిక్యూషన్ జయేంద్రకు మొత్తం 88 ప్రశ్నలు సంధించింది. వీటికి జయేంద్ర 'నాకు తెలియదు, అవన్నీ అబద్ధాలు, అది సరికాదు' అని క్లుప్తంగా సమాధానాలిచ్చారు. ఈ కేసులో తనపై నమోదు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు.
80ఏళ్ల జయేంద్ర సరస్వతిని కుర్చీలో కూర్చొని సమాధానాలు ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. దాంతో ఆయన విచారణ పూర్తయ్యే వరకూ కుర్చీలో కూర్చొనే దాదాపు గంట సేపు సమాధానాలు ఇచ్చారు. మఠం మేనేజర్ సుదర్శన్ అయ్యర్ సహా, ఇతరులు కూడా తమకేమీ తెలియదంటూ సమాధానాలు ఇచ్చారు. ఈ కేసును న్యాయస్థానం ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేసింది.