దీదీకి సీబీఐ షాక్: ప్రధాన అనుచరుడు అరెస్ట్, ఏ కేసు అంటే..?
బెంగాల్లో దీదీ వర్సెస్ మోడీ వార్ జరుగుతోంది. ఇద్దరూ కలిసిన సందర్భంలో నవ్వుతూ మాట్లాడుతున్నా.. లోన మాత్రం పాత పగలు అలానే ఉంటాయి. అవును బెంగాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బలంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిని దీదీ అదేస్థాయిలో అడ్డుకుంటుంది. తాజాగా దీదీ అనుచరుడిని సీబీఐ అరెస్ట్ చేసింది. పాత కేసును తోడి మరీ.. అదుపులోకి తీసుకుంది.
విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో పార్థ ఛటర్జీ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ షాక్ ఇచ్చింది. దీదీకి సన్నిహితుడు, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ను అరెస్ట్ చేసింది. ఆవులను అక్రమంగా రవాణా కేసు విషయంలో అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఈ కేసు 2020లో నమోదు కాగా.. ఇవాళ అదుపులోకి తీసుకుంది.
సీబీఐ జారీ చేసిన 10 సమన్లను అనుబ్రత మోండల్ ఖాతరు చేయలేదుట. దీంతో సీబీఐ కోర్టును ఆశ్రయించి.. ఇవాళ అరెస్ట్ చేసింది. 2015 నుంచి 2017 మధ్య విదేశాలకు తరలిస్తుండగా 20 వేలకుపైగా ఆవుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుందని సీబీఐ చెబుతుంది. 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీర్భూమ్లో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించింది.
కేసులో మోండల్తోపాటు ఆయన బాడీగార్డ్ సైగల్ హుస్సేన్ను కూడా అరెస్టు చేశారు. టీఎంసీ కీలక నేత, మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడు పార్థ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ఫ్లాట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఇతర విలువైన ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మోండల్ను అరెస్ట్ చేసింది. మమతా బెనర్జీని గుక్క తిప్పుకోకుండా చేయాలని బీజేపీ అనుకుంటుంది. ఆ ప్రణాళికలో భాగంగానే అరెస్టుల పర్వం కొనసాగుతోంది.