రేప్ కేసు: మాజీ మంత్రిని ప్రశ్నించి, అరెస్టు చేసిన సిబిఐ
జైపూర్: ఓ మహిళపై అత్యాచారం జరిపి, దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో సిబిఐ అధికారులు రాజస్థాన్ మాజీ మంత్రి బాబూలాల్ నగర్ను శుక్రవారం ప్రశ్నించారు. జైపూర్లోని సర్క్యూట్ హౌస్లో నగర్ వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు నమోదు చేశారు
తనకు సిబిఐ దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని, ఈ కేసుకు సంబంధించితాను తన అభిప్రాయాలను, వాంగ్మూలాన్ని సిబిఐకి రాతపూర్వకంగా ఇచ్చానని ఆయన విచారణకు హాజరయ్యే ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. విచారించిన తర్వాత బాబూలాల్ నగర్ను సిబిఐ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు.
తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, సిబిఐ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, తాను ఏ విషయం కూడా దాచబోనని చెప్పారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జైపూర్లోని తన అధికారిక భవంతికి సెప్టెంబర్ 11వ తేదీన పిలిచి మహిళపై బాబూలాల్ నగర్ అత్యాచారానికి, దాడికి పాల్పడ్డాడని సోదాలా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
రాజస్థాన్ పోలీసుల నుంచి సిబిఐ అక్టోబర్ 9వ తేదీన కేసును తన చేతుల్లోకి తీసుకుంది. కేసు నమోదు కావడంతో బాబూలాల్ నగర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంతకు ముందు సిబిఐ నగర్ నివాసంలో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించింది. సిబిఐ బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంటికి వెళ్లి నమోదు చేసింది. నగర్ కాంగ్రెసు పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యాడు.