వ్యాపం కిల్లింగ్ స్కాం, సీబీఐ దర్యాప్తు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న వ్యాపం స్కాం కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరుగుతున్నా మీరు ఏమి చేస్తున్నారు అంటు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడి గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ లకు నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాలలోపు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఈనెల 24వ తేదికి వాయిదా వేసింది. కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని చెప్పింది. వ్యాపం స్కాంలోని నిందితులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కిల్లింగ్ స్కాం అని పేరుగాంచింది.
ఈ కేసు దర్యాప్తు సీబీఐతో దర్యాప్తు చేయించాలని 9 మంది వేరు వేరుగా సుప్రీం కోర్టులో పిటీషన్లు వేశారు. పిటీషనర్ ల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. వ్యాపం స్కాంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. వ్యాపం స్కాంలో ఆరోపణలు వచ్చినా గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ మీద ఎందుకు చర్యలు తీసుకొలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కేసు విచారణ హై కోర్టులో ఉందని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుతం చేతులు దులుపుకుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, సీబీఐ దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.