సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు రద్దు: చివరి మూడు పరీక్షల ఆధారంగా మార్కులు..గ్రేడింగ్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయి. క్లాస్-10, క్లాస్-12వ తరగతులకు నిర్వహించ తలపెట్టిన పరీక్షలను రద్దు చేసినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతోన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించారు. జస్టిస్ ఏంఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి వివరించారు.

సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడం మంచిది కాదంటూ దేశవ్యాప్తంగా పలు పేరెంట్స్ కమిటీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

కేంద్రం, సీబీఎస్ఈని ఆదేశించేలా..
పరీక్షలను నిర్వహించకూడంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సీబీఎస్ఈ బోర్డు అధికారులను ఆదేశించాలని విజ్ఙప్తి చేశాయి. పరీక్షలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటీషన్లను దాఖలు చేశాయి. పేరెంట్స్ కమిటీల తరఫున ప్రముఖ న్యాయవాది రిషి మల్హోత్రా ఈ పిటీషన్లను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా రిషీ మల్హోత్రా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వాదించారు.

ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి
ఈ పిటీషన్లు గురువారం మధ్యాహ్నం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి వచ్చాయి. జస్టిస్ ఏంఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. పేరెంట్స్ కమిటీల నుంచి అందిన విజ్ఙప్తులను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించినప్పుడే పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అప్పటిదాకా ఎలాంటి పరీక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనితోపాటు ఐసీఎస్ఈ పరీక్షలు కూడా రద్దవుతాయని అన్నారు.

చివరి మూడు పరీక్షల ప్రతిభ ఆధారంగా..
చివరి మూడు పరీక్షల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారికి మార్కులను వేస్తామని సొలిసిటర్ జనరల్ తెలిపారు. చివరి మూడు వార్షిక పరీక్షల్లో సాధించిన గ్రేడింగ్, మార్కుల ప్రాతిపదికన 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల మార్కులను అసెస్ చేస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడం సరి కాదనే అభిప్రాయం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సీబీఎస్ఈ అధికారుల్లోనూ వ్యక్తమౌతోందని సొలిసిటర్ జనరల్ చెప్పారు. వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
Recommended Video

కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్..
పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సీబీఎస్ఈ అధికారులు రూపొందించాల్సి ఉంది. శుక్రవారమే దీన్ని సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు మార్కులను వేయడంలో ఎలాంటి మార్గదర్శకాలు, ఎలాంటి నిబంధనలను అనుసరిస్తారనే విషయాలను ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పొందుపరుస్తారని తెలుస్తోంది. విద్యార్థులు చివరి మూడు వార్షిక పరీక్షలను ఆధారంగా చేసుకుని మార్కులు, గ్రేడింగ్ను రూపొందిస్తారు.












Click it and Unblock the Notifications