సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే, సందేహాలు వద్దు: తేల్చేసిన బోర్డు, కీలక వివరాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ స్పందించింది. పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

సీబీఎస్ఈ పరీక్షలపై లక్ష మంది విద్యార్థుల పిటిషన్..
ప్రస్తుతం కరోనా కేసులు ఉధృతిని దృష్టిలో పెట్టుకుని మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్లైన్లో నిర్వహించాలని సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేశారు. అంతేగాక, cancelboardexams2021 అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.

పరీక్షలు రద్దు కోరుతూ విద్యాశాఖ మంత్రికి వినతి..
దేశంలో గత సంవత్సరం తక్కువ కేసులు ఉన్న సమయంలోనే పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు కేసులు నాటికన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని త్వరలో జరగబోయే వార్షిక పరీక్షలను రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నామంటూ విద్యార్థులు పేర్కొన్నారు. తమపై ఉన్న పరీక్షలనే తీవ్ర ఒత్తిడిని తొలగించాలని కోరారు.

షెడ్యూల్ ప్రకారమే సీబీఎస్ఈ పరీక్షలు.. కరోనా నిబంధనలతోనే..
ఈ పిటిషన్పై సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే పరీక్షా కేంద్రానలు కూడా 40-50 శాతం పెంచామన్నారు. కరోనా నిబంధనలను పాటించేలా సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నామని వివరించారు.

పరీక్షలపై అసత్య ప్రచారాలు చేయొద్దు..
షెడ్యూల్ ప్రకారమే వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీబీఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ కూడా స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దన్నారు. దీంతో మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా, కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.