సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస్తవమేనని ,వేధింపులతో సిద్దార్థ కలత చెందిన మాట నిజమేనని కర్ణాటకకు చెందిన శృంగేరీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ.డీ రాజేగౌడ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆదాయపన్ను వేధింపుల కారణంగా సిద్దార్థ తీవ్రంగా కలత చెందారని. ఆయనను ఆదాయపు పన్నుశాఖ ఇబ్బంది పెట్టకుండా ఉంటే... ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పారు. కాగా సిద్దార్థ తనకు ఫ్యామిలీ మిత్రుడని చెప్పిన ఎమ్మెల్యే గత నలబై సంవత్సరాలుగా ఇద్దరి మధ్య స్నేహం ఉందని అన్నారు.
కర్నాటక ఆర్ధిక పురోగతితో పాటు దేశ ఆర్ధిక రంగం కోసం ఆయన కష్టపడి పనిచేశారని, ముప్పయి నుండి నలబై వేల మంది గ్రామీణ యువతకు, పేదలకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. మరోవైపు ఆయన చేసిన అప్పులు తీర్చేందుకు కొన్ని ఆస్తులను కూడా అమ్మేందుకు సిద్ధపడ్డారని తెలిపారు....సిద్దార్థకు అప్పుల కంటే ఆయన ఆస్తులు చాలా ఎక్కువని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తన మరణానికి కొద్దిరోజుల ముందు కేఫ్ కాఫీ డే బోర్డు సభ్యులు, ఉద్యోగులకు ఆయన ఈ లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ అధికారి తనను వేధించారంటూ సిద్ధార్థ తన లేఖలో ఆరోపించారు. తాను లాభదాయక వ్యపారాన్ని సృష్టించలేకపోయినందుకు చింతిస్తున్నట్టు ఆయన లేఖ పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications