ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ ఉపఎన్నికలు- మే 2న ఫలితాలు- ఈసీ షెడ్యూల్
ఏపీలోని తిరుపతి లోక్సభ సీటుతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్ధానాల్లో ఉప ఎన్నికలకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇరు స్ధానాల్లో ఏప్రిల్ 17న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండా
ఏఫీలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లోక్సభ స్ధానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే స్ధానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్ధానాల్లో ఉప ఎన్నికల కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 30 వరకూ ఇరుచోట్లా నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 31న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మే 2న ఫలితాలు ప్రకటిస్తారు.
తిరుపతి లోక్సభ స్ధానానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే టీడీపీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ఎంపిక చేశారు. జనసేనతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తమ అభ్యర్ధిని బరిలోకి దింపాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కూడా తమ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోరు తప్పేలా లేదు.