Union Budget 2024: తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి నెల జీతం ఫ్రీ-బడ్జెట్ లో కేంద్రం ఆఫర్..!
దేశవ్యాప్తంగా ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కేంద్రంపై ఆగ్రహం ఎన్నికల వేళ కనిపించింది. దీంతో ఈసారి కేంద్రం తన తొలి బడ్జెట్ లోనే ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరే వారి కోసం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఆఫర్ ప్రకటించారు. దేశంలో ఏ సంస్ధలో అయినా తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి ఇది వర్తించనుంది.

దేశంలో ఓ సంస్ధలో అయినా ఉద్యోగి తొలిసారి ఉద్యోగంలో చేరుతున్నట్లయితే అతనికి నెల జీతం ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తొలి నెల జీతం అందేలోపు ఇబ్బందులు పడకుండా కేంద్రం ఈ పథకాన్ని తెస్తోంది. ఇది తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి మాత్రమే వర్తించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్వో సహకారంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేయబోతోంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఈపీఎఫ్వోకు చెల్లించనుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా తొలిసారి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మరోవైపు ఇవాళ ప్రకటించిన ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కొత్త ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. EPFOలో నమోదు, ఉద్యోగులు, యజమానులకు మద్దతు ఇవ్వడం, మొదటి సారి ఉద్యోగులను గుర్తించడంపై దృష్టి సారించడం వంటివి ఇందులో ఉన్నాయి. తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన ద్వారా అదనపు ఉపాధిని కల్పిస్తామని నిర్మల హామీ ఇచ్చారు. ఇందులో నేరుగా ఉద్యోగి , యజమాని ఇద్దరికీ, నిర్దిష్ట స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలలో EPFO సహకారంతో ఈ పథకం ద్వారా ఉపాధిలోకి ప్రవేశించే 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications