గుడ్న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన కేంద్రం, వారికి రూ. 200 ఎల్పీజీ సబ్సిడీ
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు, వాహనదారులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
లీటర్ పెట్రోల్పై రూ. 9.5, డీజిల్పై రూ. 7 తగ్గింపు
ఈ నేపథ్యంలో పెట్రోల్ లీటర్పై రూ. 9.5, డీజిల్ లీటర్పై రూ. 7 తగ్గనుంది. ఈ రాత్రి నుంచి తగ్గింపు ధరలు అమలులోకి రానున్నాయి. కాగా, సున్నితత్వంతో పని చేయాలని, సామాన్యులకు ఉపశమనం కలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని అన్ని విభాగాలను ప్రత్యేకంగా కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
పేద, సామాన్యుల కోసమే మోడీ సర్కారు నిర్ణయం: నిర్మల
"పేద, సామాన్యులకు సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతకు అనుగుణంగా, ఈ రోజు, మేము మా ప్రజలకు సహాయం చేయడానికి మరిన్ని చర్యలను ప్రకటిస్తున్నాము అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. '
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో లక్ష కోట్ల ఆదాయంపై ప్రభావం
మేము పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నాము. దీంతో లీటరు పెట్రోల్పై రూ. 9.5, డీజిల్పై లీటరుకు రూ. 7 తగ్గుతుంది. ఇది ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయంపై ప్రభావం కలిగి ఉంటుంది' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రాల్లో పెట్రోల్ పై అదనంగా మరో రూపాయిన్నర, డీజిల్ పై అదనంగా మరో రూపాయి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం ధరలపు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గిస్తే వినియోగదారులకు మరింత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభించే అవకాశం ఉంది.
వారికి ఎల్పీజీపై రూ. 200 సబ్సిడీ
కాగా, గతంలో దీపావళి సందర్భంలోనూ లీటరు పెట్రోల్ పూ రూ. 5, డీజిల్ పై రూ. 10 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. మరోవైపు, వంటగ్యాస్ ధరనూ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ కు రూ. 200 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏడాదికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తించనుంది. ఇది ఇలావుండగా, కాగా, స్టీల్, సిమెంట్ పై సుంకాలను కూడా కేంద్రం తగ్గించింది. దీంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి.