కేరళ వరదలు ‘తీవ్రమైన ప్రకృతి విపత్తు’: కేంద్రం ప్రకటన, ఎక్కువ మొత్తంలో సాయం
న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో, కేరళ వరద బీభత్సాన్ని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో కేరళకు ఆర్థిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, కేంద్రం పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కేరళకు మొత్తం రూ.600కోట్లు ప్రకటించిన కేంద్రం.. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, కేరళలో వరదలతో ఇప్పటికే 320మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గత రెండ్రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వారి స్వస్థాలకు వెళుతున్నారు. కానీ, ఇంట్లో వరద సృష్టించిన బీభత్సంతో ఆవేదనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications