కరోనా రిటర్న్: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ
న్యూఢిల్లీ: చైనాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న బీఎఫ్ 7 వేరియంట్ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ కావడం వల్ల తక్షణమే ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. కోవిడ్ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచనలు చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ..
ఈ మేరకు ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. క్రిస్మస్ మొదలుకుని కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండగ సీజన్ ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజేష్ భూషణ్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019లో కూడా ఇదే డిసెంబర్లో కోవిడ్ మహమ్మారి చైనాలో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది లక్షలాది మంది ప్రాణాలను తీసిన సెకెండ్ వేవ్ కూడా డిసెంబర్/జనవరి నెలల్లోనే ఆరంభమైంది.

పండగల నేపథ్యంలో..
ఇప్పుడు కూడా ఇదే సీజన్లో దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తక్షణ నివారణ చర్యలను తీసుకుంటోంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను విధించింది. పండగల సీజన్ కు కూడా దీన్ని వర్తింపజేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తాము సూచించిన గైడ్ లైన్స్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని రాజేష్ భూషణ్ సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ పద్ధతిని అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన ప్రదేశాలు, ప్రాంతాలపై నిఘా ఉంచాలని, వైరస్ మళ్లీ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కోవిడ్ -19 తగిన జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు.

జిల్లా స్థాయిలో నిఘా..
ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్ నెస్ (ఐఎల్ఐ), సీవర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్ (ఎస్ఏఆర్ఐ) వంటి జిల్లా స్థాయిలో నిఘా ఉంచాలని రాజేష్ భూషణ్ సూచించారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలను తప్పనిసరి చేయాలని, ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేతులను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.

ఆసుపత్రుల్లో డ్రై రన్..
ఆసుపత్రుల్లో డ్రై రన్ నిర్వహించాలని రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్ వార్డులు, బెడ్స్, క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాలు, సరిపడినన్ని ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications