Delhi Budget : ఎట్టకేలకు ఢిల్లీ బడ్డెట్ ను ఆమోదించిన కేంద్రం-ముప్పేటదాడితో కీలక నిర్ణయం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆర్ధికమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు నేపథ్యంలో బడ్డెట్ ను ప్రవేశపెట్టేందుకు మరో మంత్రి కైలాశ్ గెహ్లాట్ ను ఎంచుకున్న ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్రం షాకిచ్చింది. ఢిల్లీ బడ్జెట్ కు ఆమోదముద్ర వేయకుండా జాప్యం చేస్తూ వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ కారణాలతో బడ్డెట్ ను ఆమోదించకుండా జాప్యం చేయడమేంటన్న చర్చ సాగింది. దీంతో కేంద్రం ఇవాళ ఆమోదం తెలిపింది.
ఢిల్లీ బడ్డెట్ కేటాయింపుల్లో తప్పులున్నాయన్న కారణం చూపి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేసింది. వాస్తవానికి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా.. కేంద్రం నుంచి ఆమోదం రాలేదని ఆర్ధికమంత్రి కైలాశ్ గెహ్లాట్ అసెంబ్లీకి తెలిపారు. దీంతో కేంద్రం తీరుపై విమర్శలు వచ్చాయి. చివరికి ముప్పేట దాడితో కేంద్రం ఢిల్లీ బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకూ, ఆప్ ప్రభుత్వానికీ మధ్య అస్సలు పడటం లేదు. ఏ చిన్నకారణం దొరికినా ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బడ్డెట్ కూడా కొర్రీలు పెడుతూ కేంద్రం అడ్డుకోవడంతో బీజేపీ, ఆప్ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ కూడా అసెంబ్లీలో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య తీవ్ర మాటలయుద్ధం చోటు చేసుకుంది. చివరికి కేంద్రం బడ్డెట్ కు ఆమోదం తెలపడంతో రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేజ్రివాల్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications