ముందస్తుకు జగన్, కేసీఆర్ పరుగు- ఇక్కడ ఎస్- అక్కడ నో- మోడీ ఉద్దేశం అదేనా ?
తెలుగురాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై రాజకీయ పార్టీలు తలోరకంగా స్పందిస్తున్నా.. అనివార్యంగా ముందస్తు రాగాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ముందస్తుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇద్దరికీ భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. దీంతో వీరిద్దరూ అంతే స్ధాయిలో తమదైన వ్యూహాలతో ముందుకు సాగిపోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల వ్యవహారం ఇప్పుడు జాతీయస్ధాయిలోనూ చర్చకు తావిస్తోంది.
ముందస్తుకు జగన్ వ్యూహాలు
ఏపీలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ సిద్దమైపోతున్నారు. ఇఫ్పటికే ఆర్ధికంగా తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని మరెంతోకాలం నడపటం సాధ్యం కాదని తేలిపోవడం, విపక్షాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజల్లో కనీసం సానుభూతి తెచ్చుకుని మళ్లీ గెలవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రయత్నాల్లో భాగంగానే కేబినెట్ ప్రక్షాళన, మంత్రుల బస్సు యాత్రలు, గడప గడపకూ ప్రభుత్వం వంటి కార్యక్రమాల్ని జగన్ చేపడుతున్నట్లు అర్ధమవుతోంది. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ ఇస్తున్నసంకేతాల్ని అందిపుచ్చుకుని విపక్షాలు కూడా సిద్ధమైపోతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ ముందస్తు రాగం
ఇటు తెలంగాణలో సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్జోంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు మోడీ ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కూడా జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణలోనూ ఎన్నికల్ని అదే సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కచ్చితంగా నష్టపోతానన్న భయం కేసీఆర్ లో ఉంది. దీంతో గతంలోలాగే ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికలతో సంబంధం లేకుండా ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ గతంలో కేంద్రంలో మోడీ సర్కార్ మద్దతుతో ముందస్తుకు వెళ్లి గెలిచిన కేసీఆర్.. ఈసారి మాత్రం అలాంటి మద్దతు పొందే అవకాశాలు కనిపించడం లేదు.
మోడీ ఉద్ధేశం ఇదేనా ?
ఏపీలో తమకు పరోక్ష మిత్రపక్షంగా ఉన్న వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కేంద్రం..అటు తెలంగాణలో మాత్రం అధికార పక్షం టీఆర్ఎస్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో జమిలి ఎన్నికలు తెస్తే తెలంగాణలోనూ తమకు పనికొస్తుందన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అది గ్రహించిన కేసీఆర్.. ముందస్తు రాగాలు తీస్తున్నారు. కానీ కేంద్రం ఒప్పుకోకపోతే అది సాధ్యం కాదు. కానీ ఏపీలో మాత్రం వైసీపీకి ముందస్తు అవకాశం ఇవ్వడం ద్వారా మరోసారి గెలిచి తమకు అండగా నిలిచేలా చేసుకోవాలనేది మోడీ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల ముందస్తు ప్రయత్నాల్లో మోడీ నిర్ణయం కీలకంగా మారబోతోంది.