పాక్ తో యుద్దమేఘాల వేళ ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశం..!
పహల్గాం దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఇదే క్రమంలో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ తాజాగా ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించింది. ఇందులోనూ తీవ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ పాకిస్తాన్ నుంచి భారత్ వైపు పేల్చేందుకు ప్రయత్నించిన మిస్సైల్స్ ను అడ్డుకుంది. దీంతో పాటు దేశంలోని ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న ఓటీటీల్లో నుంచి పాకిస్తాన్ కు సంబంధించిన కంటెంట్ ను నిలివేయాలని కేంద్రం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఓటీటీ ప్లాట్ఫారమ్లు, మీడియా స్ట్రీమింగ్ సేవలు, ఇతర భాగస్వాములు పాకిస్తాన్ నుండి వెలువడే వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్ను వెంటనే నిలిపివేయాలని కోరింది.

ఈ కంటెంట్ సబ్ స్కిప్షన్ మోడల్ లో లేదా ఉచితంగా ఇస్తున్నా దాన్ని నిలిపేయాలని కేంద్రం ఆయా ఓటీటీ ప్లాట్ ఫారాల్ని కోరింది. జాతీయ భద్రతా కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఇవాళ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఇప్పటికే తమ ప్లాట్ ఫారాలపై ఉన్న పాకిస్థానీ వీడియోలు, ఆడియోలు, పాడ్ కాస్ట్ లు, ఇతర కంటెంట్ ను ఓటీటీలు తొలగిస్తున్నాయి. కేంద్రం గతంలో భారతదేశంపై రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్ , తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారనే ఆరోపణలతో పాకిస్తాన్ కు చెందిన డాన్, జియో న్యూస్ వంటి ప్రధాన మీడియా సంస్థలతో పాటు ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ , ఉమర్ చీమా వంటి జర్నలిస్టులతో సహా 15 కి పైగా యూట్యూబ్ ఛానళ్లను భారత్ నిలిపేసింది.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానళ్లు లేదా టీవీ ఛానళ్లు, ఓటీటీలు భారత్ పై విష ప్రచారం చేయొచ్చన్న సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్ కు చెందిన కంటెంట్ విషయంలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంలో తమ కంటెంట్ ప్రసారం కాకపోతే పాకిస్తాన్ బ్రాడ్ కాస్టర్లకు షాకులు తప్పదు.












Click it and Unblock the Notifications