క్రిప్టో కరెన్సీపై నిషేధం లేనట్లే-నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు-పార్లమెంటులో బిల్లు
దేశంలో క్రిప్టో కరెన్సీని అనుమతించాలా వద్దా అనే విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా పలు దేశాలు పాడుతున్న క్రిప్టో కరెన్సీని దూరంగా ఉంచడం ద్వారా సమస్యలు కొనితెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్న కేంద్రం.. ప్రస్తుతానికి దానిపై నియంత్రణ విధిస్తే చాలని భావిస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.
క్రిప్టో కరెన్సీకి అనుమతి
అంతర్జాతీయంగా పలు దేశాల్లో క్రిప్టో కరెన్సీ వాడకం, ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ లోనూ దీన్ని అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీని హవాలా మార్గాల్లో అక్రమాలకు పాల్పడే వారు, తీవ్రవాదులు వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇరుకునపడుతోంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ని అనుమతిస్తే ఓ తంటా, అనుమతించకపోతే మరో తంటా అన్నట్లుగా పరిస్ధితి మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
క్రిప్టో కరెన్సీ పై నిషేధం లేనట్లే
క్రిప్టో కరెన్సీ వాడకంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, తీవ్రవాదులు, హవాలా నేరగాళ్లు వాడుకుంటారనే భయాలు ఉన్నా ప్రస్తుతానికి దీని వాడకాన్ని అడ్డుకునే పరిస్ధితి లేదు. దీంతో కేంద్రం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది.ఇందుకు తగినట్లుగానే క్రిప్టో కరెన్సీ పై నిషేధం విధించే ప్రతిపాదన కేంద్రం దగ్గర లేనట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ పై నిషేధం విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రాన్ని నడిపిస్తున్న ఆరెస్సెస్ సైతం క్రిప్టో కరెన్సీ వాడకాన్ని అడ్డుకోవాలని డిమాండ్లు చేస్తోంది. అయినా ప్రస్తుతానికి కేంద్రం వాటిని పక్కనబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నియంత్రణకే పరిమితం
క్రిప్టో కరెన్సీని అనుమతిచ్చే విషయంలో కేంద్రం ఆలోచించుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తిస్ధాయిలో నిషేధించే కంటే నియంత్రణతో కూడిన వాడకానికి అనుమతించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆర్భీఐతో పాటు ఇతర ఆర్ధిక సంస్ధలు, అధికారులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుతోంది.
క్రిప్టో కరెన్సీని తీవ్రవాదులు, హవాలా నేరగాళ్లు వాడుకుంటారనే భయాలున్నా అంతిమంగా దీనిపై నిషేధం విధించే పరిస్ధితి లేకపోవడంతో నియంత్రణ దిశగా కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
పార్లమెంటు సమావేశాల్లో బిల్లు
క్రిప్టో కరెన్సీపై ఓవైపు అభ్యంతరాలు మరోవైపు దీన్ని అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మధ్యేమార్గాన్ని ఎంచుకుంటోంది. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తూనే దానిపై నియంత్రణలు విధించాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాలసమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం కాకుండా పలు చర్యలతో ఈ బిల్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరెన్సీ కంటే మరిన్ని నియంత్రణలతో క్రిప్టో కరెన్సీని అనుమతించే ఈ బిల్లుకు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ కరెన్సీల పతనంతో
తాజాగా అన్ని ప్రధాన డిజిటల్ కరెన్సీలు దాదాపు 15 శాతానిపైగా పతనాన్ని చవిచూశాయి, బిట్కాయిన్ అయితే సుమారు 18.53 శాతం, ఎథిరియం 15.58 శాతం,టెథర్ 18.29 శాతం పడిపోయాయి. క్రిప్టోకరెన్సీల సమాచారం ఇచ్చే న్యూయార్క్ వెబ్ సైట్ కాయిన్డెస్క్ ప్రకారం, మంగళవారం సాయంత్రం బిట్కాయిన్ విలువ $55,460.96కి క్షీణించింది, ఇది నవంబర్లో అంతకుముందు చేరిన ఆల్-టైమ్ గరిష్ట స్థాయి దాదాపు $69,000తో పోలిస్తే అదనంగా 20 శాతం క్షీణించింది.
ఈ పరిణామాల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. క్రిప్టోకరెన్సీలు తప్పుడు చేతుల్లోకి వెళ్లి మన యువతను పాడుచేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరారు. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను నివారించడానికి క్రిప్టోకరెన్సీపై నిషేధం కంటే బలమైన నియంత్రణ ఉండాలని ప్రధాని సూచించారు. ఇందుకు అనుగుణంగానే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.