ఇథనాల్ ప్రయోగం వాదనపై కేంద్రం యూటర్న్..! సుప్రీం విచారణపై వివరణ...!
నిన్న చమురు సంస్థ బీపీసీఎల్ కు ఇథనాల్ కేటాయింపు విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వినిపించిన వాదనల్లో ట్విస్ట్ ఎదురైంది. విచారణ సందర్భంగా ఏజీ.. పెట్రోల్ లో ఇథనాల్ కలిపే విధానం (Ethanol blending) ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, వచ్చే ఏడాదికి దీనిపై క్లారిటీ వస్తుందంటూ చెప్పినట్లు వార్తలొచ్చాయి. వీటిపై విమర్శలు రావడంతో ఏజీ కార్యాలయం వివరణ ఇచ్చింది.
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇథనాల్ ఇంకా ప్రయోగదశలోనే ఉన్నట్లు ఏజీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కార్యాలయం ఖండించింది. కొన్ని వార్తా కథనాల్లో, ప్రభుత్వం 20% ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) కార్యక్రమాన్ని ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని, దాని ప్రభావాలు వచ్చే ఏడాదిలోనే తెలుస్తాయని పేర్కొన్నట్లు ప్రచారం జరిగిందని, ఈ సమాచారం పూర్తిగా తప్పు అని తెలిపింది. వాస్తవానికి అటార్నీ జనరల్.. డెడికేటెడ్ ఎథనాల్ ప్లాంట్లకు ఎథనాల్ కేటాయింపు అంశంపై సంబంధిత పిటిషన్లు వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని, ఈ పిటిషన్లన్నింటినీ ఒకేసారి విచారించేందుకు ట్రాన్స్ఫర్ పిటిషన్లు దాఖలుకు పరిశీలిస్తున్నామని, తద్వారా వేర్వేరు తీర్పులు రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారని తెలిపింది.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ప్రస్తుత కేసులో 2025-26 ఎథనాల్ సరఫరా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత స్థితి కొనసాగించాలని ఆదేశించిందని తెలిపింది. E20 ఎథనాల్ మిశ్రమ కార్యక్రమం ఒక ప్రయోగం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని పీఐబీ వివరణలో స్పష్టం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలు తప్పుదారి పట్టించేవిగా తెలిపింది. E20 ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా ఇంధన దిగుమతులను తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, అలాగే దేశీయ బయో-ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం చేపట్టిన కీలక జాతీయ విధానంగా పేర్కొంది.














Click it and Unblock the Notifications