రోజుకు 2 బిలియన్ వ్యాక్సిన్లు-కేంద్రం కల నెరవేరాలంటే 6 రెట్లు ఉత్పత్తి తప్పనిసరి
భారత్లో కోవిడ్ కల్లోలం సాగుతున్న వేళ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. సెకండ్వేవ్పై ముందుచూపు లేకపోవడంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం అంచనాలకు తగినట్లుగా కూడా లేదు. దీంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో 2 బిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేసి తీరుతామని కేంద్రం తాజాగా ప్రతిజ్ఞ చేసింది. దీనిపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 2.3 మిలియన్ డోసులుగా ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తిని 2 బిలియన్ డోసులకు తీసుకెళ్లడం అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్లో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంపు
భారత్లో ప్రస్తుతం రోజుకు 2.3 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదీ కేవలం భారత్ బయోటెక్, సీరం సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నవే. వీటిని భారీ ఎత్తున పెంచాలని కేంద్రం నుంచి వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో తమ టెక్నాలజీని ఇతర సంస్ధలతో పంచుకోవాలని కూడా భారత్ బయోటెక్ వంటి సంస్ధలపై ఒత్తిడి ఉంది. దీంతో టెక్నాలజీ పంచుకునేందుకు సైతం భారత్ బయోటెక్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇలా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం చేయని ప్రయత్నం లేదు.
2 బిలియన్ డోసుల లక్ష్యం
ప్రస్తుతం దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్ధితులను అదుపులోకి తీసుకురావాలంటే వ్యాక్సిన్లు మాత్రమే అంతిమ అస్త్రంగా భావిస్తున్న కేంద్రం ప్రస్తుతం రోజువారీ ఉత్పత్తి అవుతున్న 2.3 మిలియన్ డోసుల్ని ఏకంగా 2 బిలియన్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా చేయాలంటే ఉత్పత్తిని భారీగా పెంచడంతో పాటు కొత్త తయారీ సంస్ధలకు అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవం లేని సంస్ధలకు హడావిడిగా అనుమతులు ఇస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో కేంద్రం పెట్టుకున్న రెండు బిలియన్ డోసుల ఉత్పత్తి లక్ష్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఉత్పత్తి ఆరు రెట్లు పెంచాల్సిందే
కేంద్రం లక్ష్యం ప్రకారం ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య రోజుకు 2.16 బిలియన్ డోసుల్ని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోజుకు ఉత్పత్తి అవుతున్న 2.3 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని 2 బిలియన్లకు చేర్చాలంటే వాటి ఉత్పత్తిని ఆరు రెట్లు పెంచాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా చేస్తే తప్ప 2 బిలియన్ డోసుల మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమే. కానీ ఉత్పత్తిని ఆరు రెట్లు పెంచేందుకు ప్రస్తుతం పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.
జూలై నుంచి వ్యాక్సిన్ తయారీ ఇలా
కేంద్రం అంచనా వేస్తున్న విధంగా రోజుకు 2 బిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేసేందుకు వాటి తయారీ సంస్ధలైన భారత్ బయోటెక్, సీరంతో పాటు స్పుత్నిక్కు కూడా లక్ష్యాల్ని నిర్ద్దేశిస్తోంది. వీటి ప్రకారం సీరం ఇన్స్టిట్యూట్ జూలై నుంచి రోజుకు 75కోట్ల కోవిషీల్డ్ డోసులు, భారత్ బయోటెక్ రోజుకు 55 కోట్ల డోసులు, స్పుత్నిక్ వీ 15.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు 30 కోట్ల బయో ఈ వ్యాక్సిన్, 5 కోట్ల జైడూస్ క్యాడిలా వ్యాక్సిన్, 20 కోట్ల సీరం-నోవావాక్స్ వ్యాక్సిన్లు, 10 కోట్ల భారత్ బయోటెక్-వాషింగ్టన్ యూనివర్శిటీ నషాల్ వ్యాక్సిన్, 6 కోట్ల జెన్నోవా వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇలా చేస్తేనే ఆగస్టు-డిసెంబర్ మధ్య భారత్లోని 95 కోట్ల మంది యువజనులకు కేంద్రం కోరుకున్న విధంగా డోసులు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది.
Recommended Video