బెంగాల్ పోరు తీవ్రం- సీఎస్ను ఢిల్లీ పంపేందుకు మమత నో- ఇవాళే రిటైర్మెంట్
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాలేదనే కారణంతో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ను రీకాల్ చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఎం మమత కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో సీఎస్ను ఢిల్లీ పంపరాదని మమత సర్కార్ నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇవాళ ఆలాపన్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సిన నేపథ్యంలో మమత సర్కార్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రానికి మమత చెక్
యస్ తుఫానుపై ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు గైర్హాజరయ్యారనే కారణంగా సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ను రీకాల్ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మమతా బెనర్జీ సర్కార్ చెక్ పెట్టింది. సీఎస్ ఆలాపన్ను ఢిల్లీ వచ్చి రిపోర్ట్ చేయాల్సిందిగా హోంశాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆయన ఢిల్లీ వెళ్లే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో హోంశాఖ ఆదేశాల ధిక్కారానికి ఆయన సిద్దమమైనట్లే కనిపిస్తోంది. ఈ మేరకు న్యాయ వర్గాల అభిప్రాయం తీసుకున్న సీఎం మమత ఈ నిర్ణయానికి వచ్చారు. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాయబోతున్నారు.
నేడే సీఎస్ రిటైర్మెంట్
సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ఇవాళ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని మూడునెలల పాటు పొడిస్తూ రీకాల్ కంటే ముందే కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాళే ఆయన్ను ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలని కేంద్రం కోరడంతో రిటైర్మెంట్పై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని ఆలాపన్కు మమతా సర్కార్ సూచించడంతో ఆయన ఇవాళ కోల్కతాకే పరిమితం కానున్నారు. అంతే కాదు. యస్ తుఫానుపై సీఎం మమతా బెనర్జీ నిర్వహిచే రివ్యూలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇవాళ ఈ రివ్యూ పూర్తి చేసుకుని ఆయన రిలీవ్ కానున్నారు. దీంతో కేంద్రం ఆదేశాల్ని లెక్కచేయకుండా రిటైర్మెంట్ వేళ బెంగాల్లోనే ఉండేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన పొడిగింపును ఆయన వినియోగించుకుంటారా లేదా అన్నదీ ఉత్కంఠ రేపుతోంది.
కేంద్రానికి పరాభవం
అఖిలభారత సర్వీసు అధికారులపై తమకు పెత్తనం ఉన్నా బెంగాల్ సీఎస్ను ఢిల్లీ రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కేంద్రానికి శృంగభంగం తప్పేలా లేదు. బెంగాల్ సీఎస్ ఆలాపన్ ఇవాళ రిటైర్మెంట్ కానున్నారని తెలిసినా ఉద్దే్శపూర్వకంగా ఆయన్ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కోరడం, దీనికి సీఎం మమత నిరాకరించడంతో ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ఆభాసుపాలవుతోంది. ఇవాళ ఆలాపన్ ఢిల్లీకి వెళ్లకపోతే మాత్రం కేంద్రం మమతతో పోరులో పరాభవం పాలైనట్లేనన్న వాదన వినిపిస్తోంది.
Recommended Video