కరోనావైరస్ డెత్ సెర్టిఫికేట్ మార్గదర్శకాలు ఇవే: సుప్రీంకోర్టు ముందుంచిన కేంద్రం
న్యూడిల్లీ: కరోనావైరస్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సంబంధిత మరణాలకు సెర్టిఫికేట్లు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.
కరోనా మృతుల బంధువులకు మరణానికి గల కారణాలతో వైద్య దృవపత్రాలు జారీ చేయాలంటూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 3వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 31న కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించే మార్గదర్శకాలు, ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొంది. ఈ మార్గదర్శకాల మేరకు.. ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్ పరీక్ష, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష లేదా ఆస్పత్రుల్లో/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కరోనా నిర్ధారణకు ప్రామాణికంగా పరిగణిస్తారు.
ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ ఉన్నా.. విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో.. హత్యకు గురై, రోడ్డు ప్రమాదాలతో మరణిస్తే కోవిడ్ మరణంగా.. జనన, మరణ నమోదు చట్టం 1969లోని సెక్షన్ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధృవీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని కోవిడ్ మరణంగా పరిగణిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ రిజిస్ట్రార్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తారు.

కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ సోకిన 30 రోజుల్లో మరణించిన వారందరికి ఇక కోవిడ్ కారణంగానే మృతి చెందినట్టు మరణ ధృవికరణ సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు. కరోనా సోకినట్టు నిర్ధారించిన లేదా ఆసుపత్రిలో ఇన్ పెషెంట్గా చేరి 30 రోజుల తర్వాత మరణించిన వారందరిని కోవిడ్ కారణంగానే మృతి చెందినట్టు గుర్తించనున్నారు. మరణం ఆసుపత్రిలో జరిగినా, ఇంటి వద్ద జరిగినా కానీ ఇందులో ఎలాంటి మార్పులుండవని కేంద్రం తెలిపింది.
కోవిడ్ సోకిన వారిలో 95 శాతం మరణాలు 25 రోజులలోపే జరుగుతాయని ఐసీఎంఆర్ స్టడీలో తేలిందని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. ఇక అదే సమయంలో ఆత్మహత్య, యాక్సిడెంట్, ఇతర కారణాలతో మరణిస్తే వారిని ఈ కేటగిరిలో చేర్చలేమని తెలిపింది.మరోవైపు గతంలో జారీ అయిన డెత్ సర్టిఫికేట్లపై అభ్యంతరాలున్న వారి కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది కేంద్రం. అభ్యంతరాలున్న వారంతా ఈ కమిటీలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం చూపిస్తామని పేర్కొంది. అది కూడా 30 రోజుల్లోనే ఈ కమిటీ సమస్యను పరిష్కరిస్తోందని కేంద్రం తెలిపింది.
కాగా, కరోనా మృతులకు డెత్ సర్టిఫికేట్ల జారీకి సంబంధించి సుప్రీం కోర్టు జూన్ 30న తీర్పు వెలువరించింది.. డెత్ సర్టిఫికేట్ల జారీ విషయంలో ప్రస్తుతమున్న నిబంధనలను సడలించి.. మరింత సులభతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో డెత్ సర్టిఫికేట్లలో కోవిడ్ కారణంగా మృతి చెందినట్టు స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.












Click it and Unblock the Notifications